భౌతిక టోల్ ప్లాజాలు తీసివేత
శాటిలైట్ ద్వారానే వసూళ్లు
త్వరలోనే కొత్త టోల్ పాలసీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఒక బిగ్ న్యూస్ చెప్పారు. వార్త సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసిన ప్రకారం… “దేశం అంతటా కొత్త టోల్ విధానం అమలు చేయబోతున్నాం. ఇది రాబోయే 10 రోజుల నుంచి 15 రోజుల్లో అమలులోకి వస్తుంది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం ” అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన మంత్రి, దేశవ్యాప్తంగా భౌతిక టోల్ బూత్లను త్వరలో తొలగిస్తారు అని అన్నారు. టోల్ గేట్లను తీసేస్తే వాహనాల నుంచి టోల్ ఎలా వసూలు చేస్తారని అడిగినప్పుడు, కొత్త టోల్ విధానం గురించి కేంద్ర మంత్రి స్వల్ప సమాచారం ఇచ్చారు. “కొత్త టోల్ విధానం గురించి ప్రస్తుతానికి నేను పెద్దగా చెప్పను. కానీ రాబోయే 15 రోజుల్లో భారత ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని అమలు చేయబోతోంది అని మాత్రం నేను చెప్పగలను” అని అన్నారు. టోల్ ఎలా వసూలు చేస్తారు? “దేశంలో కొత్త టోల్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత, ఉపగ్రహ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది” అని నితిన్ గడ్కరీ చెప్పారని పీటీఐ నివేదించింది. ఉపగ్రహ ట్రాకింగ్ వ్యవస్థ గురించి కూడా కేంద్ర మంత్రి ఒక విషయం చెప్పారు. హైవే మీదకు వచ్చిన వాహనం నంబర్ ప్లేట్ను ఉపగ్రహం ద్వారా గుర్తిస్తారని, ఆ తర్వాత టోల్ రుసుము ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్ అవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల మాన్యువల్ టోల్ వసూలు అవసరం ఉండదు. దేశంలోని రహదారి మౌలిక సదుపాయాల గురించి కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి కాస్త గొప్పగా చెప్పారు. “రాబోయే రెండేళ్లలో భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాలోని మౌలిస సదుపాయాల కంటే మెరుగ్గా ఉంటాయి” అని అన్నారు. ముంబై-గోవా హైవే గురించి మాట్లాడిన నితిన్ గడ్కరీ, ఈ ఏడాది జూన్ నాటికి ఆ జాతీయ రహదారి పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి అని అన్నారు. ముంబై-గోవా జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతాయి.