విశాఖపట్నం జయజయహే : విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు.ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకి వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం అందుకొని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని పోస్ట్ చేసారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారనీ, విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందన్నారు. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ బుధవారం ట్వీట్ చేసారు.
టీడీపీ ఆగ్రహం??
విమాన సర్వీస్ల జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ సంచలనం రేపింది . ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి – విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే కదా.. కేంద్రమంత్రి రామ్మోహన్కి ఫోన్ చేయొచ్చు కదా..? అని టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలి అని టీడీపీ వ్యాఖ్యలు చేసింది .