విజయనగరం, జయజయహే : ప్రస్తుత వేసవి సీజనులో జిల్లాలో నిర్మాణ రంగ అవసరాలకు సరిపడేంతగా నిరంతరాయంగా ఇసుక సరఫరాకు సిద్ధంగా వుందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాలు, ప్రజావసరాల కోసం, ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల నిర్మాణాల కోసం 2.86 లక్షల ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా స్థాయి ఇసుక సరఫరా కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం వివిధ ఇసుక రీచ్ల వద్ద అందుబాటులో వున్న ఇసుక, డిపోల వద్ద లభ్యత, కొత్తగా రీచ్ లకు అనుమతి వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం వున్న కుసుమూరు, కె.వెంకటాపురం ఇసుక రీచ్ల ద్వారా 89 వేల టన్నులు లభ్యమవుతుందని, రేగిడి ఆమదాలవలస మండలంలోని బొడ్డవలస, శ్రీకాకుళం జిల్లా తోటపాలెం వద్ద గల మేడమర్తిలో మరో రెండు ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ఫీజిబిలిటీ రిపోర్టు వున్నందున పది రోజుల్లో అవసరమైన పర్యావరణ అనుమతులు పొంది యీ రెండు పాయింట్ల ద్వారా మరో 1.97 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలకు 10 వేల టన్నులు, వైద్య కళాశాల నిర్మాణ అవసరాలకు 10 వేల టన్నుల ఇసుకను సరఫరా చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ తదితర ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనులకు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు కూడా అవసరమైన మేరకు ఇసుక సరఫరా చేయాలని సూచించారు.డెంకాడ, కొత్తవలస, బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో వున్న ఇసుక డిపోల్లో ఒక్కో చోట 50 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరాకు సిద్ధంగా వుంచనున్నట్టు చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై జరిపిన తనిఖీల సందర్భంగా పోలీసులు సీజ్ చేసిన ఇసుకను గృహనిర్మాణ శాఖకు అందజేయాలని అదనపు ఎస్.పి.కి కలెక్టర్ సూచించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాదవన్, అదనపు ఎస్.పి. సౌమ్యలత, ఆర్.డి.ఓ. కీర్తి, జిల్లా గనులశాఖ అధికారి మోహనరావు, ఉప రవాణా కమిషనర్ మణికుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. సరిత, హౌసింగ్ పి.డి. మురళి, భూగర్భశాఖ డి.డి. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే మూడు నెలల్లో నిరంతరాయ సరఫరాకు 2.86 లక్షల టన్నుల ఇసుక సిద్ధం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
0
14
RELATED ARTICLES
- Advertisment -