Wednesday, June 18, 2025
HomeBHAKTIమే 12న పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌ర మ‌హోత్స‌వం -ఆల‌య కార్య‌నిర్వ‌హాణాధికారి కెఎన్‌విడివి ప్ర‌సాద్‌

మే 12న పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌ర మ‌హోత్స‌వం -ఆల‌య కార్య‌నిర్వ‌హాణాధికారి కెఎన్‌విడివి ప్ర‌సాద్‌

విజ‌య‌న‌గ‌రం, జయజయహే : ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌ర మ‌హోత్స‌వాన్ని మే 12న ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, ఉప క‌మిష‌న‌ర్ కెఎన్‌విడివి ప్ర‌సాద్ తెలిపారు. త‌మ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, దేవ‌ర ఉత్స‌వం గురించి వివ‌రించారు. మే 12వ తేదీ సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు పైడిత‌ల్లి అమ్మ‌వారి వ‌నం గుడివ‌ద్ద భారీ ఊరేగింపు ప్రారంభ‌మై, గంట‌స్థంభం మీదుగా హుకుంపేట చేరుకుంటుంద‌ని తెలిపారు. తిరిగి రాత్రి 10 గంట‌ల‌కు హుకుంపేట‌లోని అమ్మ‌వారి చ‌దురువ‌ద్ద పూజ‌ల అనంత‌రం బ‌య‌లుదేరి, మంగ‌ళ‌వారం ఉద‌యానికి మూడు లాంత‌ర్లు స‌మీపంలోని అమ్మ‌వారి చ‌దురుగుడికి చేరుకుంటుంద‌ని చెప్పారు. ఈ ఉత్స‌వంలో భ‌క్తులు భారీ ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. పైడిత‌ల్లి ఆల‌య సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు మాట్లాడుతూ, అమ్మ‌వారి దేవ‌ర ఉత్స‌వాన్ని సంప్ర‌దాయ‌భ‌ద్దంగా, అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. దీనిలో భాగంగా వైశాఖ‌మాసం మే 12న అమ్మ‌వారి వ‌నం గుడివ‌ద్ద ఉత్స‌వ విగ్ర‌హాన్ని మేళ‌తాళాల‌తో, ఘటాల‌తో, కోలాటాలు, విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో భారీ ఊరేగింపుతో అంగ‌రంగ‌వైభ‌వంగా హుకుంపేట తీసుకొనివెళ్లి, అక్క‌డి చ‌దురువ‌ద్ద పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. అనంత‌రం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఊరేగింపు బ‌య‌లుదేరి అమ్మ‌వారి చ‌దురుగుడికి చేరుకుంటామ‌ని తెలిపారు. అక్క‌డినుంచి తెల్ల‌వారుఝామున ఉద‌యం 4 గంట‌ల ప్రాంతంలో బ‌య‌లుదేరి అమ్మ‌వారి జ‌న్మ‌స్థాన‌మైన పెద్ద‌చెరువు చేరుకొని, అక్క‌డ సంప్ర‌దాయానుసారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారికి ఆహ్వానం ప‌లికి, పెద్ద‌చెరువు మ‌ట్టిని తోడ్కొనివ‌చ్చి, చదురుగుడిలో పూజ‌లు నిర్వ‌హణ అనంత‌రం అక్క‌డే పైడిమాంబ‌ అమ్మ‌వారు కొలువుదీరుతార‌ని తెలిపారు. ఆరోజు నుంచి సుమారు ఆరునెల‌ల పాటు ఆశ్వీజ‌మాసంలో జ‌రిగే ఉయ్యాల కంబాల ఉత్స‌వం వ‌ర‌కు పైడిత‌ల్లి అమ్మ‌వారు చ‌దురు గుడిలోనే ఉండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తార‌ని వెంక‌ట‌రావు వివ‌రించారు. శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం ఉద్యోగులు ఏడుకొండ‌లు, ర‌మేష్‌, త‌ల‌యారి పైడిరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments