కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీలో చేరారు. జనసేన అధినేత పవన్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. అయితే.. భారీ మెజార్టీతో పవన్ అక్కడ విజయం సాధించారు. దీంతో మాట ఇచ్చినట్లుగానే ఆయన తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అయితే… ఎన్నికల నాటి నుంచి పద్మనాభ రెడ్డిగా పెద్దగా యాక్టీవ్ గా ఉండడం లేదు. అయితే.. తాజాగా ఆయనను జగన్ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇందుకు పద్మనాభం కూడా స్పందించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో ముద్రగడ మళ్లీ యాక్టీవ్ అవుతారన్న చర్చ ప్రారంభమైంది