మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకానిలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేష్ ఆదివారం భూమి పూజ చేశారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణం జరుగనుంది. దేశంలోనే అత్యున్నత ఆస్పత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. 1984లో 30 పడకల ఆస్పత్రి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానికులు 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా చేయాలని తనను కోరారని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. హాస్పిటల్లో డీహైడ్రేషన్ సెంటర్ను కూడా ఇందులో కలుపుతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి పానకాల స్వామి గుడిని కూడా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2019లో ఓడిపోయినప్పుడు తనను చాలామంది కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. మంగళగిరి ప్రజలు దానికి ధీటుగా తనను గెలిపించి సమాధానం ఇచ్చారని తెలిపారు. అన్ని రంగాల్లో మంగళగిరి నెంబర్ వన్ స్థానంలో ఉండాలనేది తన లక్ష్యం మని ఉద్ఘాటించారు. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా అందరం పనిచేయాలని సూచించారు. మంగళగిరిలో చాలామంది హైపర్ టెన్షన్ డయాబెటిక్స్తో బాధపడుతున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో మన ఇల్లు – మన లోకేష్ తొలిదశ కార్యక్రమానికి ఇవాళ చివరి రోజు. మూడువేలమంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ తొలిదశ కార్యక్రమాన్ని ఈ రోజుతో మంత్రి నారా లోకేష్ పూర్తి చేయనున్నారు. తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 478 మందికి, డ్రైవర్స్ కాలనీకి చెందిన 119 మందికి ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ ఆదివారం నాడు పంపిణీ చేయనున్నారు. సలాం సెంటర్కు చెందిన 92 మందికి, ఉండవల్లి సెంటర్కు చెందిన 85మందికి, సీతానగరానికి చెందిన – 48 మందికి ఇళ్ల పట్టాలను లోకేష్ పంపిణీ చేయనున్నారు. పద్మశాలీ బజార్కు చెందిన 9మందికి, ఉండవల్లికి చెందిన ఒక్కరికీ ఇళ్ల పట్టాలను లోకేష్ ఇవ్వనున్నారు. ఇవాళ మొత్తంగా 832 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈరోజుతో మొత్తం మూడువేల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లోకెష్ పూర్తిచేయనున్నారు. లబ్ధిదారులకు సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి, భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు.