బేతంచెర్ల : జయజయహే: ప్రజల అభిమతం మేరకే దశరధుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడని, అలాగే సగర చక్రవర్తి కుమారుడైన అసమంజుడు రాజు కావడాన్ని ప్రజలు అంగీకరించని పక్షంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తండ్రి అయిన సగరుడు తన కుమారుడిని రాజ్యం నుండే తరిమి వేశాడని, ప్రజాస్వామ్యం యొక్క విలువను చాటిన సద్గ్రంధం శ్రీమద్రామాయణం అని, అందుకే యుగాలు మారినా తరాలు మారినా శ్రీమద్రామాయణానికి అంతటి ఆదరణ అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బేతంచెర్ల మండలం, వీరాయిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శ్రీమద్రామాయణంపై వివరించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై జి.భానోజిరావు చేసిన ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకులు చంద్రశేఖర్, పురోహితులు యంబాయి పవనయ్య, పూజారి తిరుమలేశ్వర రెడ్డి, భజన మండలి సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుంకన్న, యం. శ్రీనివాసులు రెడ్డి, హనుమంతు రెడ్డి, యు.శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, యం. చిన్నస్వామి రెడ్డి, యం. రామేశ్వర రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.