విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాదని, మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం పాకులాట తగదన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లిలో ఏర్పాటు చేయనున్న మిట్టల్ స్టీల్ కు క్యాపిటివ్ మైన్స్, పోర్టు కేటాయించవలసిందిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం సరైంది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలకు పట్టకపోవడం శోచనీయం. 32 మంది ప్రాణ త్యాగాలతో “ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు”గా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి, అభివృద్ధి చేయకపోతే పాలకులు చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ కేటాయించమని అడగకుండా, మిట్టల్ ఏర్పాటు చేసే స్టీల్ ఫ్యాక్టరీకి మైన్స్ కేటాయించి, పోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరటం దుర్మార్గం. కేంద్రం చేస్తున్న కుటిలయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సై అనటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కు అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని, ఆ తదుపరి మాత్రమే మిగిలిన వాటి కోసం ఆలోచించాలని సూచిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొలుత విశాఖ ఉక్కుకు క్యాపిటివ్ మైన్స్ కేటాయించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందిగా కోరుతున్నాం అని రామకృష్ణ పేర్కొన్నారు.