సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ యాత్రను సజావుగా, శోభాయమానంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలి. టిక్కెట్ల విక్రయం నుండి వాహనాల నిర్వహణ వరకు ప్రతీ అంశాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి అని పేర్కొన్నారు.
ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేత చేయనున్నారని,
రూ.1000, రూ.300 ధరల టిక్కెట్ల విక్రయాన్ని అనుకూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పాసుల జారీ చేయాలని,
కొండపైకి, దిగువన భక్తుల రవాణా కోసం తగిన సంఖ్యలో RTC బస్సుల ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి, మజ్జిగ కేంద్రాలు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్, సైన్ బోర్డులు, శాశ్వత పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు , పార్కింగ్ సమస్య నివారణకు అదనపు స్థలాల అభివృద్ధి చేయాలని తెలిపారు.
పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీ మాట్లాడుతూ చందనోత్సవం జరుగు ప్రతిచోట కొండపై మరియు దిగువ ప్రాంతంలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.పార్కింగ్ కోసం అదనపు స్థలాలు కేటాయించాలని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో, దేవాదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ ఈవో కె. సుబ్బారావు, ఇతర రెవెన్యూ, వైద్య, రవాణా, ఆర్టీసీ, జీవీఎంసీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని విభాగాల మధ్య సమన్వయం కీలకం అని చెబుతూ, అధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకుంటూ వేడుకను విజయవంతం చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.