చేబ్రోలు కిరణ్ చేసిన పోస్టులు కేవలం విమర్శల స్థాయిలో కాకుండా వ్యక్తిత్వ హననానికి దారి తీసేలా ఉండటంతో, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో పోటాపోటీ పోస్టులు మొదలయ్యాయి. కొందరైతే కిరణ్ వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు తీవ్రంగా ఖండించారు. విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రమైన చర్యలకు పూనుకుంది. మహిళలు, చిన్నారులపై సైతం నీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదన్న నిశ్చయంతో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఏ పార్టీ వారైనా మహిళలు, చిన్నారులపై ట్రోల్స్ చేయడం, అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తే అస్సలు ఊరుకోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పెద్దలు పోలీసులకిచ్చిన సూచనల మేరకు మంగళగిరి పోలీసులు, విజయవాడ – ఇబ్రహీంపట్నం రోడ్డులో కిరణ్ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే వ్యక్తి తమతో కొనసాగలేడు అనే ఉద్దేశంతో, వెంటనే చేబ్రోలు కిరణ్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ తరహా వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని, మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ అనుబంధ విభాగమైన ఐటీడీపీలో కిరణ్ ఇప్పటివరకు యాక్టివ్ కార్యకర్తగా ఉన్నారు.
మాజీ ఎంపీ గోరంట్ల అరెస్ట్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్పై దాడికి యత్నించిన ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. చేబ్రోలు కిరణ్ను పోలీస్ గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని వాహనంలో గుంటూరు తరలించే క్రమంలో గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు. ఆ క్రమంలో అతడిపై గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. అయితే మాధవ్ ప్రయత్నాన్ని గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో మాధవ్ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పీఎస్కు తరలించారు.