ఏపీలో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంగా రూపుదిద్దుకోనున్న ఓ
కీలక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీకారం చుట్టారు. గోదావరి నదీ తీరాన అఖండ గోదావరి పేరుతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి పవన్ శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొన్నారు.
కేంద్రం నిధులు రూ.375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్రమంత్రి షెకవాత్ తో కలిసి పవన్ కళ్యాణ్ తిలకించారు. అనంతరం గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు.
రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరమని, తీరం వెంబడి నాగరికత, నాగరికత ఉన్న చోట భాష వృద్ధి చెందుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాంటి ఈ నేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేర్గాంచిన డొక్కా సీతమకు జన్మనిచ్చిందన్నారు. మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయకు జన్మనిచ్చిన నేల ఇది అన్నారు. ఎంతో మంది కళాకారులకు, సామాజిక వేత్తలకు జన్మనిచ్చింది ఈ నేల అన్నారు. బాపు-రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణను అందించిన నేల కూడా అన్నారు.
హేవలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైందని,నిరుపయోగంగా ఉందని, దీన్ని బాగుచేసుకొని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్ష, కల అన్నారు. ఈ కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు పవన్ తెలిపారు. దాదాపు రూ.430 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టుల పనులు ఈరోజు ప్రారంభిస్తున్నట్లు తలిపారు. వీటిల్లో కొన్నింటికి ప్రణాళికలు పూర్తికాగా మరికొన్ని పనులు పూర్తిచేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని 2024 ఎన్నికల సమయంలో ఎన్డీయే సర్కార్ నిర్ణయించిందని, అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు అన్నారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 800 మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. టూరిజం ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం కాదని, శక్తివంతమైన ప్రభుత్వం అని అర్ధమన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో శక్తివంతమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల ప్రాజెక్టులు సులువుగా వస్తాయని, త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మొదటి నుండి ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటంలో నాడు జలశక్తి మంత్రిగా ఉండి సహకరించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సైతం సహకరించారన్నారు.
ఏపీకి 974 కి.మీల సుదీర్ఘ సముద్రతీరం, గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, ఇంకా ఎన్నో చిన్న నదులు ఉన్నాయని, నదీ పరివాహక ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ ఏరియా ఉంటుందని, విదేశాల్లో ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ లుగా అభివృద్ధి చేసుకుంటారని, మనకు నదులు సంస్కృతిలో భాగమని, ఈ క్రమంలో పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు చారిత్రక, కళా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అభివృద్ధి చేస్తామన్నారు.
అన్నవరం, గండికోట, శ్రీశైలం తదితర ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్నాయని, ఇటీవల విదేశాల పర్యటనకు దుర్గేష్ వెళ్లి వచ్చారని, పవిత్ర బుద్ధ భగవానుని అవశేషాలను వియత్నాం దేశానికి తీసుకెళ్లారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా ఆకర్షించేలా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం, పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న నేలబిడ్డ కందుల దుర్గేష్ ల సారథ్యంలో పర్యాటక రంగం ముందుకు వెళ్తుందన్నారు.