చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
డిల్లీ, రాజమండ్రిలలో ఆధునీకరించనున్న షోరూమ్ ల డిజైన్లపై సంతృప్తి
విజయవాడ: జయజయహే : హస్తకళల ఆకృతులు ఉట్టిపడేలా లేపాక్షి విక్రయ కేంద్రాలను ఆధునీకరించనున్నట్టు చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. సాంప్రదాయకతకు పెద్దపీట వేస్తూనే ఆధునిక షోరూమ్ లకు రూపకల్పన చేస్తున్నామని. ఈ క్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ తో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. శుక్రవారం విజయవాడ లేపాక్షి కేంద్ర కార్యాలయంలో స్కూల్ ఆప్ ప్లానింగ్ ప్రతినిధులతో కలిసి వివిధ షోరూమ్ ల నూతన డిజైన్లను పరిశీలించారు. ప్రత్యేకించి దేశ రాజధాని డిల్లీలో ఏర్పాటు చేస్తున్న నూతన షోరూమ్ డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, హస్తకళలు, చేనేత సౌరభాలు, తెలుగు దనం ఉట్టి పడేలా షోరూమ్ రూపుదిద్దుకోవాలన్నారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేయనున్న షోరూమ్ డిజైన్లను కూడా సిసోడియా పరిశీలించారు. తిరుపతి షోరూమ్ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ప్రతి షోరూమ్ లాభాల బాటలో పయనించాలి
సంస్ధ పరంగా చూసినప్పుడు లేపాక్షి సంక్ధ లాభాలలో ఉన్నప్పటికీ, ప్రదర్శన శాలల వారిగా పరిశీలిస్తే కొన్ని చోట్ల నష్టాలు ఉన్నాయని సిసోడియా గుర్తించారు. ఈ నేపధ్యంలో ప్రత్యేకించి షోరూమ్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. షోరూమ్ ల వారిగా లాభ నష్టాలను పరిశీలించిన సిసోడియా, నష్టాలలో ఉన్న షోరూమ్ ల పనితీరును లోతుగా పరిశీలించి సూచనలు చేసారు. ఉత్పత్తుల పరంగా మార్పు లేనప్పుడు అమ్మకాల పరంగా ఎందుకు వెనకడుగు పడుతుందని ప్రశ్నించారు. షోరూమ్ ల ఆధునీకరణ, సీజన్ లవారి విక్రయాలు, ఇతర సమస్యలను సిసోడియా దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అన్ని షోరూమ్ లు తప్పని సరిగా లాభాల బాటలో పయనించవలసిందేనని హెచ్చరించారు. తాను వ్యక్తిగతంగా రాష్ట్రంలోని అన్ని షోరూమ్ లను సందర్శిస్తానన్నారు.
షోరూమ్ ను సందర్శించి కళాకృతుల పరిశీలన
తొలుత సిసోడియా లేపాక్షి కేంద్ర కార్యాలయం ఆవరణలో ఉన్న ప్రధాన ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విభిన్న కళాకృతులను పరిశీలించారు. సంస్ధ ఎండి విశ్వ అయా కళాకృతులు దేశంలోని ఏ ప్రాంతంలో రూపుదిద్దుకున్నాయి, వాటిని రూపొందించిన కళాకారులు ఏవరు వంటి విషయాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న హస్త కళాకృతులు అన్నింటినీ లేపాక్షి షోరూమ్ లలో అందుబాటులో ఉంచాలన్నారు. మార్కెటింగ్ కు అందమైన ప్యాకింగ్ అవసరమని ఆ విషయంలో రాజీ పడవద్దని సూచించారు. సమావేశంలో రాష్ట్ర స్దాయిలోని లేపాక్షి విక్రయ శాలల మేనేజర్లు, కేంద్ర కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.