కొత్తగా 89,788 మందికి పింఛన్లు
మే 1 నుంచి నగదు చెల్లింపులు
సర్కార్ రాష్ట్రంలోని వితంతువులకు చేదోడు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ కేటగిరీని గతేడాది నవంబరు నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం హయాం 2023 డిసెంబరు 1 నుంచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న స్పౌజ్ కేటగిరీకి చెందిన అర్హులు 89,788 మందికి మే నెల నుంచి పెన్షన్ రూ. 4000 అందజేయనున్నారు. వాళ్లు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చని.. అధికారులు సూచిస్తున్నారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అర్హురాలి ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి. ఏప్రిల్ 25 నుంచే అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30లోపు ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం వెరిఫై చేసి మే 1న పింఛను సొమ్ము అందజేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ లోపు నమోదు చేసుకోలేకపోతే.. వారికి జూన్ 1 నుంచి పింఛన్ నగదు ఇస్తారు. ఈ తాజా నిర్ణయం కారణంగా, ప్రభుత్వంపై నెలవారీగా రూ 35.91 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని భావిస్తున్నారు.