ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలన… తొలి అడుగు” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సభ ఈ రోజు (జూన్ 12) సాయంత్రం 5 గంటలకు విజయవాడ సమీపంలోని పోరంకి మురళి రిసార్ట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రిమండలి సభ్యులు, కూటమి ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ గత ఏడాది పాలనను ప్రజల ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రగతిని వివరించే అవకాశం ఉంది. సభలో ముఖ్య అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించనున్నారని సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం తాము చేసిన పనులను ప్రజలకు వివరించడమే కాకుండా, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన సంకేతాలను కూడా ఇవ్వనుంది.