ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ.. బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు.
సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో గంటన్నర వ్యవధిలోనే ముని కన్నప్ప అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కేసు నమోదు చేసి నిందితులను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. వారిపై BNS 341/323/324/506/34/ IPC కింద కేసు నమోదు చేశారు.