ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) తీవ్రంగా ఖండిస్తూ జగన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
ఈ సందర్భంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ వైఖరిని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త
కుటుంబాన్ని పరామర్శించడం మానవత్వం గల చర్యగా అభినందనీయమన్నారు.కానీ ఈ సందర్భాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించేలా, అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం, ఖండనీయమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్ను హెచ్చరిస్తున్నామని కేజీఎఫ్ నాయకులు తెలిపారు.
రాజకీయ నాయకులకు హెచ్చరిక
గతంలో తెలంగాణలో కేటీఆర్, ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో కమ్మ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా చెల్లించుకున్న మూల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.2023 తెలంగాణ ఎన్నికలో బీఆర్ఎస్ ఘోరఓటమి తరువాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం ఈ విషయాన్ని రుజువు చేస్తుందన్నారు. ఇకపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తే, కమ్మ సామాజిక వర్గం మరింత సమైక్యతతో, గట్టిగా స్పందిస్తుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అన్ని సామాజిక వర్గాలను గౌరవించే బాధ్యతను చేపట్టాలని కేజీఎఫ్ హెచ్చరించింది.