మధురవాడలో ‘యూనిటీ మాల్’
రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం – మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన
విశాఖపట్నం: జయజయహే : మే 1 దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 2 శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు సమాచారం. మరో కీలక నిర్మాణానికి విశాఖ వేదిక కానుంది. రూ.172 కోట్లతో జీ+4 అంతస్తులతో యూనిటీ మాల్ను నిర్మించనున్నారు.ఇందుకోసం తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 2026 మార్చి నాటికి మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా ఏపీ సర్కార్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కేంద్రం రూ.172 కోట్లను 50 సంవత్సరాల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది.
వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్:
మధురవాడ రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 426/2లోని 5 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ మాల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రుషికొండ బీచ్కు 5 కిలోమీటర్ల దూరంలో కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని నిర్మించనున్నారు. జీ+4లోని మొదటి, రెండు అంతస్తుల్లో 62 దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్, భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలకు వీటిని కేటాయించనున్నారు. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లు ఉంటాయి.రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు కూడా వస్తాయి. వీటిపై వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుంది.