విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడిపి, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎంతో సుందరమైన విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అలాగే విశాఖకు సు విశాలమైన సాగర తీరం ఉందని ఎంతోమంది పర్యాటకులు, సందర్శకులు విశాఖ నగరానికి వస్తూ ఉంటారని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు విశాఖ సాగర తీరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యత నివ్వాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ యంత్రంతో శుభ్రం చేసే వాహనాల పనితీరును, విధానాన్ని పరిశీలించడంతోపాటు స్వయంగా బీచింగ్ క్లీనింగ్ వాహనాన్ని మేయర్ నడిపారు. సాగర తీరంలో అపరిశుభ్రతకు తావివ్వకుండా నిత్యం పారిశుద్ధ్య కార్మికులచే వ్యర్ధాలను తరలించి ఆ ప్రదేశాలను పరిశుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని, అలాగే వ్యర్ధాలు వేయకుండా సందర్శకులుకు, పర్యాటకులకు దుకాణాదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రజారోగ్యపు అధికారులు, పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.