Tuesday, June 17, 2025
HomeBlogవావిలాల జీవితం నేడు రాజకీయ నేతలకు ఆదర్శప్రాయం కావాలి - డొక్కా మాణిక్య వరప్రసాద్

వావిలాల జీవితం నేడు రాజకీయ నేతలకు ఆదర్శప్రాయం కావాలి – డొక్కా మాణిక్య వరప్రసాద్

జయజయహే : పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్వాతంత్యసమర యోధులు కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని వారి నిడారంబరత, నిజాయితీ, త్యాగ నిరతని నేటి రాజకీయ నేతలు అలవర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ రాత్రి కీ||శే|| గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతిని పురస్కరించుకుని శాసనసభ్యులు నాడు – నేడు అనే అంశంపై చర్చా గోష్టి గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రధాన వక్తగా హాజరైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర గాంధీగా తెలుగు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. నెహ్రూ, గాంధీల ఉదార భావజాలాన్ని సోషలిస్ట్, లౌకిక దృక్పథాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముందుకు తీసుకువెళ్లాలన్నారు. తెలుగు ప్రజలు ధనస్వామ్యానికి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారని వివరించారు. నేటి రాజకీయాల్లో వావిలాల లాంటి నిజాయితీపరులకు అవకాశం, మద్దతు కల్పించడం లేదన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వావిలాల గోపాలకృష్ణయ్య తన 13వ ఎటనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, 1952 నుండి వరుసగా స్వల్ప వ్యయం తో శాసన సభ్యునిగా 4 సార్లు ఎన్నికైనారని, జీవితం అంతా పేద ప్రజల అభ్యున్నతి కోసం ,సమాజ పురోగమనం కోసం కృషి చేశారని, నాగార్జునసాగర్ నిర్మాణంలో, గ్రంథాలయ ఉద్యమంలో, తెలుగు భాష అభివృద్ధిలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో కీలక భూమిక వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. నేడు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ్యులు 30 కోట్లకు పైగా వ్యయం చేసి గెలిచిన అనంతరం అత్యధిక అవినీతిపరులుగా మారుతున్నారని, సహజ వనరుల దోచుకుంటున్నారని ఇసుక, మద్యం, గనులు, అధికారుల బదిలీలు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని అన్నారు. మన దేశ లోక్ సభలో 46 శాతం మంది సభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని, ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యులు కూడా 79 శాతం క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని, 90 శాతం పైగా కోటీశ్వరులు అని దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చట్టసభలకు పోటీ పడుతున్న వారు కేవలం 500 ధనిక కుటుంబాలు మాత్రమే అని ముఖ్యమంత్రి పదవికి 2,3 కుటుంబాలు మాత్రమే పోటీపడే స్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ వావిలాల సంస్థను పునర్జీవనం చేసి బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. భారతదేశంలో 1937 నుండి 1990 వరకు జరిగిన ఎన్నికలలో ధన ప్రభావం తక్కువగా ఉండేదని, నిజాయితీగల నాయకులు విలువలను ఆచరించే వారని తెలిపారు. నేడు రాజకీయాలలో ఏమాత్రం అవగాహన లేనివాళ్లు కేవలం అర్ధ బలంతో చట్టసభలకు ఎన్నికవుతున్నారని, మన లోక్ సభలో 543 మంది లో 400 మందికి పైగా శతకోటీశ్వరులు ఉన్నారన్నారు. 1991 నుండి అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా విద్య, వైద్యం, రాజకీయాలు కార్పొరేటీకరణకు ప్రైవేటీకరణలకు మారినాయన్నారు. భారతదేశంలో ఎన్నికలలో ధన ప్రభావం తగ్గించడానికి దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. నాడు విశ్వవిద్యాలయ నుండి కళాశాలల నుండి విద్యార్థులు రాజకీయాలలో ప్రవేశించి బలమైన రాజకీయ నాయకులుగా ఎదిగే వారని నేడు బడా పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, వివిధ రకాల మాఫియాలను ప్రోత్సహించేవారు రాజకీయాల్లోకి వస్తున్నారని తద్వారా రాజకీయాలు అవినీతిమయంగా మార్చినారన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు వావిలాల సంస్థ సంయుక్త కార్యదర్శి ,హైకోర్టు న్యాయవాది మన్నవ షోడేకర్ ప్రసంగిస్తూ 1989 నుండి 2002 వరకు వావిలాల గారితో పయనించానని ఎందరో దేశ ప్రముఖులతో పరిచయం అయ్యానని తెలిపారు. తన విద్యాభివృద్ధికి వావిలాల ఎంతో అండగా ఉండి తోడ్పడినారని వివరించారు. వావిలాల అడుగుజాడల్లో నేటి రాజకీయ నాయకులు పయనిస్తేనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో వావిలాల గోపాలకృష్ణయ్య కీలకమైన పాత్ర పోషించారన్నారు. సత్తెనపల్లి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కర్ణాటకలో అధికార బదిలీకి ప్రత్యామ్నాయ వేదిక జాగో కర్ణాటక ఎంతో తోడ్పడిందని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రత్యామ్నాయ వేదికను రూపొందించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకట్ట వేసి ,నిజాయితీ పరులు గెలవడానికి తోడ్పడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ నేడు ఉన్న శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్యని రోల్ మోడల్ గా తీసుకుని కృషి చేయాలన్నారు. నేటి రాజకీయాలలో ఆదర్శప్రాయులకు, నిజాయితీ పరులకు స్థానం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం సహ వ్యవస్థాపకులు టీ ధనుంజయ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, హిందూ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. డిన్ .దీక్షితులు, అవగాహన వ్యవస్థాపకులు కొండా శివరామిరెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ ఓ. నారాయణ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. చర్చ గోష్టి ప్రారంభించే ముందు వావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

                                           

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments