తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని సీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, రానున్న రెండు.. మూడు రోజుల పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్స్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు, మూడు రోజులు ఏపీ.. తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాల లో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో, ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.