లవర్తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు చెప్పుకొచ్చింది. అయితే, వీరి కుమారుడు పోలీసులకు సంఘటన గురించి వివరించాడు. 48 గంటల్లోనే అసలు నిందితులు ఎవరనేది తెలిసింది.
బాలుడు చెబుతున్న దాని ప్రకారం, అతడి తల్లి ఆ రాత్రి ఉద్దేశపూర్వకంగానే ఇంటి ప్రధాన గేట్లను తెరించింది. అర్థరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఈ నలుగురితో పాటు అనిత లవర్ కాశీరాం ప్రజాపత్ కూడా ఉన్నాడు. బాలుడు ఇతడిని ‘‘కాశీ అంకుల్’’ అని పిలుస్తాడు. వీరు మాన్ సింగ్ నిద్రలో ఉండగా, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ సమయంలో తాను ఈ హత్యను చూసినట్లు బాలుడు వెల్లడించాడు.
“నేను ఇప్పుడే నిద్రలోకి జారుకున్నప్పుడు తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా తల్లి గేటు తెరవడం చూశాను. కాశీ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేను భయపడ్డాను, నేను లేవలేదు, నేను నిశ్శబ్దంగా అంతా చూడటం ప్రారంభించాను. వారు మా గదికి వచ్చారు. నా తల్లి మంచం ముందు నిలబడి ఉండటం చూశాను. ఆ వ్యక్తులు అతనిని కొట్టారు, అతని కాళ్ళను పట్టుకుని, గొంతు నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిని దిండుతో అదిమాడు. నేను నా తండ్రి కోసం చేయి చాపినప్పుడు కాశీ అంకుల్ నన్ను తన ఒడిలో ఎత్తుకుని తిట్టి బెదిరించాడు,” అని బాలుడు చెప్పాడు. భయంతో నేను మౌనంగా ఉన్నానని, కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయారని, ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయినట్లు చెప్పాడు.
పోలీసులు దర్యాప్తులో అనిత, కాశీరాం మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఖేర్లిలో అనిత ఒక చిన్న జనరల్ స్టోర్ నడుపుతోంది, ఇదే సమయంలో స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం అనే వీధి వ్యాపారితో పరిచయమైంది. కాలక్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అనిత, కాశీరామ్ కలిసి నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్కి రూ. 2 లక్షలు హత్య కోసం ఆఫర్ చేశారు.
ముందుగా, బంధువులకు మాన్ సింగ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు చెప్పింది. అయితే, అతడి ఒంటిపై గాయాలు, విరిగిన పళ్లు వంటి గుర్తులు కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైద్య పరీక్షల్లో హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో అనిత , కాశీరామ్, కాంట్రాక్ట్ కిల్లర్స్లో ఒకరైన బ్రిజేష్ జాతవ్ అను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.