!!ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది
పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులకు సిద్దం అవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల దిశగా ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఇక రేషన్ వ్యవస్థలోనూ కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోంది. ఇందు కోసం తాజాగా సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా రేషన్ సరుకులకు బదులుగా నగదు చెల్లించడం, కూపన్లను పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ఏడాది పాలనపై ఐవిఆర్ఎస్లో వచ్చిన ప్రజాభిప్రాయాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే రేషన్ సరఫరా వ్యవస్థలో ఇటీవల తీసుకువచ్చిన మార్పుల పైన చర్చ జరిగింది. వృద్దులు, వికలాంగుల కు రేషన్ సరుకులను ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా.. ఫిర్యాదులు అవకాశం లేకుండా అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఖచ్చితంగా లబ్దిదారులందరికి రేషన్ సరుకులు అందించాలని నిర్దేసించారు
రేషన్ పంపిణీ వ్యవస్థ మెరుగు పర్చేందుకు చౌకధరల దుకాణాలను పెంచడం, నగదు ఇవ్వడం లేదా కూపన్లను పంపిణీ వంటి ప్రత్యామ్నాయలపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించాలని సీఎం సూచన చేసారు. గతంలోనే చంద్రబాబు ఈ ప్రతిపాదన ప్రస్తావించారు. ప్రజల నుంచి పూర్తి అభి ప్రాయ సేకరణ చేసిన తరువాత అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం.. పాలనా పరమైన నిర్ణయాల పైన ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభి ప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన సూచనలకు అనుగుణంగా మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ పంపిణీ వ్యవస్థలో నూతన ఆలోచ నల పైన ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు