అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమదులు పంచాయతీలోని గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండోవ రోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో 2017 సంవత్సరంలో కుదుర్చుకొన్న ఎంఓయు ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్&ఆర్ అందించాలని కోరుతున్నారు. విలీన మండలాలతో సహా నిర్వాసితులందరికీ పూర్తి పునరావాసం కల్పించాలని, డి పట్టా సాగు చేస్తున్న ఆదివాసులకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని నినాదాలు చేశారు. నేషనల్ పార్క్ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించరాదని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితుల అనుభవంలో ఉన్న కొండపోళ్ళు, విఎస్ఎస్లకు నష్ట పరిహారాలు అందించాలని కోరుతున్నారు. ఆదివాసుల జీవించే హక్కు, నివసించే హక్కులకు ఎలాంటి భంగం కలగరాదని.. కొండమొదలు పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదివాసీలు కోరుతున్నారు.