మాడుగుల : జయజయహే : జూన్ మూడో తేదీన జరగనున్న మాడుగుల శ్రీ మోదకొండమ్మ వారి జాతర నేపథ్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి మోదమాంబ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీని ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందే జట్లకు అందించే ట్రోఫీలను కూడా ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పోటీలలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ విధంగా ప్రదర్శించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కాబట్టి క్రీడాకారులు స్ఫూర్తితో ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పి అప్పల్రాజు, సభ్యులు డి సూర్యారావు బిహెచ్ పైడయ్య నాయుడు, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉప సర్పంచ్ జె వరహాలు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.