ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన నేడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్బంగా బుగ్గన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా ఉపేక్షించరనీ ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.. అది ప్రజలైన కూడా ఆయన ఉపేక్షించరని విమర్శించారు. ప్రజలు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి అమలుపై ప్రశ్నిస్తే ఆయన ఉగ్రంగా స్పందిస్తున్నారని తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యాయంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన బుగ్గన, ఆగస్టులో ఉచిత బస్సులు వస్తాయని చెబుతున్నారని, కానీ 15వ తేదీలు మారుతూ ఉన్నా ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. సిలిండర్ అన్నారు, ఒకటి ఇచ్చి ఎగనామం పెట్టారు. తల్లికి వందనం అంటున్నారు, కానీ ఎక్కువ మందిని అర్హులే కాదు అంటూ తిరస్కరిస్తున్నారన్నారు.
ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానాన్ని అవలంబించడంపై బుగ్గన ప్రశ్నించారు. 2 కోట్ల 7 లక్షల మందికి డబ్బులు ఇవ్వాలి అంటున్నారు. కానీ పీపీపీ ప్రకారం ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అని అస్పష్టతపై విమర్శించారు. ఈసారి బడ్జెట్ బుక్లో మొదటిసారి అప్పు వివరాలు ఇవ్వలేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ అని బుగ్గన పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేశాం. మీరు మాత్రం తక్కువ ఖర్చుతో కూడిన పాలన ఉన్నా, అమలు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దిగజారిందని బుగ్గన తెలిపారు. రాష్ట్రం మరో శ్రీలంకగా మారబోతోంది. వ్యాపారాలు నడవడం లేదు. ప్రజలు మళ్లీ అప్పుల్లో మునుగుతున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు మళ్లీ కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారానికి పాల్పడుతున్నాయని హెచ్చరించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని బుగ్గన ఆరోపించారు. 2014లో పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్లో 19,130 కోట్లు ఉన్న ఉద్యోగుల డబ్బు చంద్రబాబు హయాంలో 76,516 కోట్లకు పెరిగింది. మేము 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు తిరిగి ఉద్యోగులకు చెల్లించాం అన్నారు.
చంద్రబాబు హయాంలో సంపద సృష్టి 3 శాతమే, కానీ అప్పులు మాత్రం 30 శాతం పెరిగాయి. కానీ మేము మాత్రం 10 శాతం సంపద పెంచాము అన్నారు. ప్రజల సంక్షేమం కోసం హామీలు ఇవ్వడం కన్నా వాటిని నిజంగా అమలు చేయడమే ముఖ్యమని, ప్రజలు మళ్లీ మోసపోవద్దని సూచించారు.