విశాఖపట్నం, జయజయహే : విశాఖ నగర పర్యావరణ పరిరక్షణ, సుందరికరణ దిశగా మహా విశాఖ నగరాన్ని నిత్యం పరిశుభ్రపరచడంలో రాత్రి పారిశుధ్య కార్మికుల విధుల పనితీరును మెరుగుపరచడంలో జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన నగరంలో ఆర్కే బీచ్ , జగదాంబ జంక్షన్ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న రాత్రి పారిశుధ్య పనుల పనితీరును పరిశీలించారు. ఈ పరిశీలనలో మేయర్ ముందుగా ఆర్కే బీచ్ వద్ద ఉన్న పారిశుధ్య కార్మికుల హాజరు పట్టి ను తనిఖీ చేసి రోజు పారిశుధ్ధ్య కార్మికులు ఎంతమంది ఎన్ని గంటలకు హాజరై రోడ్డును, బీచ్ పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారని, కొంతమంది సెలవులలో ఎందుకు వెళ్తున్నారని రాత్రి ప్యాకేజీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ను ఆరా తీశారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ వారికి సరఫరా చేసిన ఊడ్చే చీపురులను తనిఖీ చేసి నాణ్యత బాగు లేదని, వాటిని మార్చాలని, అలాగే ఇంకా ఎంత స్టాక్ చీపుర్లు ఉన్నాయో నివేదిక సమర్పించాలని, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమగు పనిముట్లు, డస్ట్ బిన్లు, తోపుడుబండ్లు సమకూర్చాలని సహాయ వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజును ఆదేశించారు. అనంతరం బీచ్ లో ఎక్కువగా వ్యర్ధాలను గమనించిన మేయర్ దుకాణాల వద్దకు వెళ్లి డస్ట్ బిన్లలో పర్యాటకులు ,సందర్శకులు వినియోగించిన వ్యర్ధాలను వేసేటట్లు అవగాహన పరచాలని, ప్రతి దుకాణం దగ్గర డస్ట్ బిన్ తప్పకుండా ఉండాలని దుఖాణదారులకు అవగాహన కల్పించాలని , అలా సహకరించని వారి షాపులను తొలగించాలని , బీచ్ సుందరీకరణ దృష్ట్యా వ్యర్థాలతో నిండి బీచ్ కాలుష్యానికి గురి కాకుండా సందర్శకులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని , అలాగే బీచ్ లో ఉన్న టాయిలెట్లను నిత్యం పరిశుభ్రపరిచేటట్లు చర్యలు చేపట్టాలని ,టాయిలెట్ల నందు కూడా స్నానపు గదులు ఉండేలా సందర్శకులకు, విహార యాత్రికులకు సౌకర్యాలను కల్పించాలని సహాయ వైద్యాధికారి కి మేయర్ ఆదేశించారు. అనంతరం జగదాంబ జంక్షన్ వద్ద రాత్రి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మాట్లాడుతూ గ్లౌజులు ,చీపుర్లు, తోపుడు బండ్లు సరఫరాపై మేయర్ ఆరా తీశారు. అక్కడే వ్యర్ధాలను సేకరిస్తున్న వాహనాన్ని పరిశీలించి రోజు రాత్రిపూట మూడు ట్రిప్పులు వ్యర్ధాలను తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని షాపులు వద్ద అధికంగా వ్యర్ధాలు రోడ్లపై వేస్తున్నారని పారిశుధ్య కార్మికులు మేయర్ కు తెలిపారు. అటువంటి దుకాణాలు, షో రూమ్స్ వద్ద ప్రత్యేకంగా డస్ట్ బిన్నులు వారే ఏర్పాటు చేసుకొని జీవీఎంసీ వాహనాలకు రోజూ అందించేలా వారికి నోటీసులు జారీ చేయాలని, అలాగే నగర సుందరీకరణ దృష్ట్యా రాత్రి పారిశుద్ధ్య పనులలో ఎటువంటి అలసత్వం , లోపాలు లేకుండా నిత్యం విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సహాయ వైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ ను మేయర్ ఆదేశించారు.