మాడుగుల : జయజయహే : అప్పట్లో పౌష్టికాహారం లోపించడం వల్లే రక్తహీనత అనారోగ్య సమస్యలు ఎదురయ్యేయని అవి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా శనివారం మాడుగుల ఐసిడిఎస్ పిఓ సిహెచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణీలకు జరిగిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వారికి పసుపు కుంకుమలు పళ్ళు అందజేసి నుదుటన కిరీటం పెట్టి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి తల్లికి బిడ్డకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో ఉన్న రక్తహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని 1998లో కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మహిళ గర్భస్థ దశ నుంచి బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు పౌష్టికాహారం అందిస్తుందని వాటిని సద్వినియోగపరచుకోవాలని తల్లులకు సూచించారు. అలాగే నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట్ల కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రం సమర్థవంతంగా నిర్వహించాలని, పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు. ఈనెల 8 నుంచి 22 వరకు ఈ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్, పాల కేంద్రం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి తాతబాబు, అద్దేపల్లి జగ్గారావు, బి రంజిత్ వర్మ, ఉండూరు దేవుడు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.