యోగా అందరికీ నేర్పించాలా?.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా? అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా రాష్ట్రంలో పాలన కనిపిస్తోందని విమర్శించారు. పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయని.. కొత్తగా బనకచర్ల వచ్చిందని విమర్శించారు. సంపద సృష్టిలో ఏదైనా ప్రత్యేక ముద్ర వేయాలి కానీ.. కొత్తగా ఏం చేయక్కర్లేదని సూచించారు. మహిళలకు ఉచిత బస్సును తాము స్వాగతిస్తాం అని బీవీ రాఘవులు తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కోసం విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. జూన్ 21న మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ఈ ఏర్పాట్లపై ఆయన మండిపడ్డారు. వియాయవాడలో సీపీఎం రాష్ట్రస్ధాయి విస్తృత సమావేశాలు ఇవాళ, రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు.
‘విశాఖ భవంతిని ప్రజోపయోగంగా చేయలేదు. వైఎస్ జగన్ గురించి మాట్లాడటానికి ఒక మ్యూజియంలా చేశారు. గత ఐదు సంవత్సరాలు వృధా చేసారు.. మరలా వృధా చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు పథకంను మేం స్వాగతిస్తాం. మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు లాభం చేకూరుతుంది. ఉచిత బస్సు వల్ల మహిళలు పురుషులపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రధాని మోడీ చెప్పినట్లు ఆడవారు బయటకి వస్తే అభివృద్ధి అని చెప్పింది నిజం. చాలా ఆలస్యంగా మహిళలకు ఉచిత బస్సు తీసుకొస్తున్నారు. కమ్యూనిష్టులు ఎన్టీఆర్ వచ్చాక స్థానం కోల్పోయారు. తిరిగి సంపాదించలేకపోయారు. కమ్యూనిష్టులకు ఆశలు ఉన్నాయి.. ఆదరణ లేదు’ అని బీవీ రాఘవులు చెప్పారు.