బెట్టింగ్ చట్ట వ్యతిరేకం అనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి.
జయజయహే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత సంక్షేమం కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పించటమే లక్ష్యంగా పని చేస్తుందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ అన్నారు. గడిచిన 11 నెలల్లో 16,347 పోస్టులతో మెగా డి ఎస్ సి, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, రూ.8.5 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏ పి పి ఎస్ సి ని నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని బలోపేతం చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యువత అనేది దేశానికి ఒక సంపద లాంటిది అని, యువత శక్తి సామర్థ్యాలు సమాజాభివృద్ధి కోసం ఉపయోగిస్తే ఎన్నో సంచలనాలు చేయవచ్చని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో యువత ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కొత్త పరిశ్రమలు రాక, ఉన్నవి తరలిపోవటం, నిరుద్యోగ భృతి రద్దు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవటం, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు రద్దు వంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్ణయాలతో యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశ నిస్పృహ తో బెట్టింగ్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్తు ను అంధకారం చేసుకున్నారని పేర్కొన్నారు. సులభంగా అధిక డబ్బులు సంపాదించవచ్చని బెట్టింగ్ లోకి దిగటం, లోన్ యాప్స్ వంటి వాటిని ఆశ్రయించి మీ భవిష్యత్ ను అంధకారమయం చేసుకోవద్దని కోరారు. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, చట్ట వ్యతిరేకం అనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో బెట్టింగ్, లోన్ యాప్స్ సంస్కృతి పెరిగిపోయిందని , వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆపరేషన్ ఈగల్ కార్యక్రమం చేపట్టి గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. బెట్టింగ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీ నేతలు జైలు పాలయ్యారని గుర్తుంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల కూటమి ప్రభుత్వం పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.