నల్గొండ జిల్లా: జయజయహే : యాదాద్రి పవర్ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది, ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా దామర చర్ల, మండలం పీర్ల పాలెం లోని పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి, యూనిట్ 1 బాయిలర్ లో ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సోమవారం తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయిం ది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరు గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి చేస్తున్న క్రమంలో…..ఈఎస్పీ వద్ద యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయ్యి బాయిలర్ నిలిచిపోయింది. జామ్ అయిన యాష్ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.