అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి
ఎన్ టి పి సి బాలికా సాధికారత కార్యక్రమంలో హోం మంత్రి అనిత
పరవాడ,మే 9 :-మహిళాశక్తి పెరిగితే దేశ శక్తి పెరుగుతుందని హోం మంత్రి అనిత అన్నారు.అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఎన్ టి పి సి సింహాద్రి దీపాంజలి నగర్లోని సకుంతల ఆడిటోరియంలో ఎన్ టి పి సి ఆధ్వర్యంలో బాలికా సాధికారత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత “స్వప్నాల విమానం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఎన్ టి పి సి వంటి సంస్థలు బాలికల సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయం అని అన్నారు. అనకాపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఆడపిల్లల ప్రతిభ కొనియాడదగినదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తెలివితేటలలో ముందుండటం ప్రశంసించదగిన విషయం అన్నారు. గంజా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ఎన్ టి పి సి సంస్థ మరింత అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను విద్యలో ముందుండేలా చూడాలని కోరారు. చదువే మంచి ఆస్తి, చదువును మించిన ఆస్తి లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.