అనంతపురం జిల్లా తిమ్మంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయల్దేరాడు కేతిరెడ్డి.. తాడిపత్రి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పటికే మూడు సార్లు తాడిపత్రి వెళ్లడానికి ప్రయత్నించారు పెద్దారెడ్డి.. కానీ, భద్రత కారణాలతో వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.. మరోవైపు, పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామంటున్నారు జేసీ వర్గీయులు.. ఈ నేపథ్యంలో.. మరోసారి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు..
అయితే, హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించిన ఆయన.. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు అని వ్యాఖ్యానించారు.. నేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ… ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.. తాడిపత్రి లో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. నేను తాడిపత్రి వెళ్తే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని భయపడుతున్నారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి.