గంగపుత్రులకు ఎన్డియే ప్రభుత్వం అండగా ఉంటుంది.
మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ 25.88 కోట్ల చెక్కును అందజేసిన చేసిన హోం మంత్రి అనిత.
నక్కపల్లి, జయజయహే : మత్స్యకారులు రియల్ హీరోలని, గంగపుత్రులకు ఎన్డియే ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నక్కపల్లి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంటాం, అని హామీ ఇచ్చారు.2004లో వేట నిషేధ భృతి కింద 30 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చేవారని, 2014లో టీడీపీ ప్రభుత్వం భృతిని రూ.4,000కి పెంచినదని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు నిషేధ భృతి 10 వేల నుంచి 20,000, వేలకు పెంచిన ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఫించన్, తుఫాను రక్షిత భవనాలు, కమ్యూనిటీ హాల్స్, చేపల ఎండబెట్టే ఫ్లాట్ ఫాంలు, సబ్సిడీ ఇంధనం, వలలు, పడవలు వంటి పథకాలు అందించామన్నారు.అలాగే మత్స్యకారులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. మత్స్యకార మహిళల కోసం అడ్డురోడ్డులో షెడ్ నిర్మాణం, మత్స్యకార పిల్లల కోసం త్వరలో జిల్లా కేంద్రంలో ఒక బి సి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. మత్స్యకారుల వేట నిషేధ భృతి 25,288 కోట్ల రూపాయల చెక్కును లబ్ధిదారులకు హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అందజేశారు.
నక్కపల్లి వారపు సంతను సందర్శించిన హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వారపు సంతను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతు బజార్ తరహాలో షెడ్ల నిర్మాణం చేపట్టాలని, పక్కా సదుపాయాలు కల్పించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.