ఇంకో తేదీ చెప్తే విచారణకు వస్తా
ఈడీకి హీరో మహేశ్ బాబు లేఖ
జయజయహే : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారని.. మనీ లాండరింగ్కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారనే ఆరోపణలతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ నెల 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం మహేశ్ బాబు ఈరోజు ఉదయం 10:30 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇవాళ ఆయన విచారణకు హాజరుకాలేక పోయారు. అయితే తాను విచారణకు హాజరుకాకపోవడంపై మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని.. అందువల్లే విచారణకు హాజరుకాలేకపోయానని మహేశ్ బాబు లేఖలొ పేర్కొన్నారు. సోమవారం కూడా షూటింగ్ ఉందని.. విచారణకు మరో తేదీని ఇవ్వాలని మహేష్ బాబు ఈడీ అధికారులను కోరినట్టు తెలుస్తోంది.