తమ అక్కను వేధించడంపై ప్రశ్నించినందుకే
అల్లూరి జిల్లా జీ కే వీధిలో ఘటన
జయజయహే : భార్యా భర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. అయితే ఒక్కోసారి అవి ఉగ్రరూపం దాల్చుతాయి. క్షణకావేశంలో భార్య భర్తల నిర్ణయాలు ప్రాణాలు పోయేంత పని చేస్తాయి. తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. భార్య భర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో మద్యం తాగి ఉన్న భర్త తన భార్యపై చేయిచేసుకున్నాడు. అది తెలిసి బావమరుదులు ప్రశ్నించారు. తాగిన మైకంలో బావ తన ఇద్దరి బావమరుదులను శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలం సిగిలేరు పంచాయితీ చింతపల్లి క్యాంపులో చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు కిముడు కృష్ణ, కిముడు రాజు మే11 న బంధువల అంత్యక్రియలకు చింతపల్లి క్యాంపుకు వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత బావ గెన్నులతో కలిసి మద్యం సేవించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే సీలేరులో మద్యం సేవించారు. ఆపై ఇంటికి వెళ్లిన తర్వాత గెన్నులు మధ్యం మత్తులో తన భార్యపై దాడి చేశాడు. ఈ విషయం తెలిసి తమ సోదరిని ఎందుకు కొడుతున్నావు అని ఇద్దరు బావమరుదులు ప్రశ్నించారు. దీంతో మద్యం మత్తులో ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు. ఇక ఈ గొడవను అడ్డుకోవడానికి వచ్చిన మరో వ్యక్తికి కూడా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు హాస్పిటల్కు తరలించారు. గాయాలపాలైన వ్యక్తిని వైజాగ్లోని కేజీహెచ్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.