ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మా లక్ష్యం
గత ఐదేళ్లలో శాసన వ్యవస్థ నిర్వీర్యం చేశారు
ఉండి నియోజకవర్గ టీడీపీ నేత నే బాధితుడు
పిటిషన్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు
జయజయహే : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిటిషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని ప్రజలకు తెలియదని, చాలామంది శాసనసభ్యులకు కూడా ఈ కమిటీ విధి విధానాల గురించి అవగాహన లేదని శాసనసభ పిటిషన్ కమిటీ చైర్మన్ , ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘు రామకృష్ణంరాజు తెలిపారు. పిటీషన్ కమిటీ తొలి సమావేశం విశాఖపట్నంలో సభ్యులు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, జగన్మోహన్ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు పిటిషన్ కమిటీ ముఖ్య ఉద్దేశాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని ఏ శాసన సభ్యుడి ద్వారానైనా పిటీషన్ కమిటీ కి ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను శాసనసభాధిపతి, పిటిషన్ కమిటీకి ఎండార్స్ చేస్తారన్నారు. వచ్చిన పిటిషన్లను పరిశీలించి, వాటికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్టును పిటిషన్ కమిటీ తెప్పించుకుంటుందన్నారు. ఒకవేళ రెవెన్యూ సమస్య అయితే ఆ సమస్యను జిల్లా కలెక్టర్ కు నివేదించి ప్రిలిమినరీ రిపోర్టును అందజేయాలని పిటీషన్ కమిటీ ఆదేశిస్తుందన్నారు. అవసరాన్ని బట్టి సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ను, అర్జీదారున్ని పిలుస్తామని తెలిపారు. అర్జీలు ఇచ్చేవారు ఆకాశరామన్న, భూతల సీతమ్మలు కాకుండా లిఖితపూర్వక ఫిర్యాదులను ఇవ్వడంతో పాటు వారి పేరు, సెల్ ఫోన్ నెంబర్, పూర్తిస్థాయి అడ్రస్ ను పొందుపరిచాలన్నారు. కమిటీ సమావేశమైనప్పుడు పిటీషన్ దారుడుని పిలిపించి విచారించి, సమస్య పరిష్కారం కోసం శాసనసభకు నివేదికను సమర్పిస్తుందన్నారు. శాసనసభ అంటే అల్లరి చేయడం కాదని , శాసనసభను గతంలో దుర్వినియోగం చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ అత్యంత శక్తివంతమైన సభ అని ఆయన పేర్కొన్నారు. శాసనసభ అనుబంధ కమిటీలన్నీ మినీ అసెంబ్లీ లాంటివని తెలిపారు. శాసనసభలో అన్ని విషయాలను చర్చించలేరు గనుక… ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి అనుబంధ కమిటీలు దోహదపడతాయన్నారు. తన నియోజకవర్గంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లను తొలగించారని, ఇండ్లను తొలగించిన వారికి టీడీఆర్ బాండ్లను ఇవ్వలేదని అసెంబ్లీలో శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రస్తావించిన ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోతే, పిటిషన్ కమిటీకి ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులను, మున్సిపల్ కమిషనర్ ను పిలిపించి, ప్రిలిమినరీ రిపోర్ట్ అడగడం జరుగుతుందన్నారు. రోడ్డు వెడల్పు లో ఇండ్లు కోల్పోయిన వారికి టిడిఆర్ బాండ్లు ఎప్పటిలోగా ఇవ్వాలని అడగడమే కాకుండా…ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు టిడిఆర్ బాండ్లను ఇవ్వకపోతే, సమస్య పరిష్కారం కోసం శాసనసభకు నివేదికను నివేదించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాసనసభ పిటిషన్ కమిటీ ఒకటి ఉంటుందని ప్రజలకు తెలియదని, ప్రజలకు పిటిషన్ కమిటీ ఒకటి ఉంటుందని… దాని ద్వారా ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవచ్చునని మీడియా ద్వారా తెలియజేసి వారిని చైతన్యపరచాలన్నది తమ కమిటీ ముఖ్య ఉద్దేశ్యమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు, పట్టణాలలో, మేజర్ పంచాయితీలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. భూముల ధరలు పెరిగిపోవడంతో, ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నా యి. కలెక్టర్ల వద్ద ఎన్నో ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి.స్థానిక నాయకుల ద్వారా ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీ పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు . ఈ కమిటీ ఏ ఉద్దేశం కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని ప్రజలందరికీ చేరవేయాలన్నదే కమిటీ సభ్యుల ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే పిటీషన్ కమిటీకి ఫిర్యాదులు అందాయని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. పిటిషన్ కమిటీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశానికి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని నిర్ణయించినట్లుగా వివరించారు. పిటిషన్ కమిటీ తొలి సమావేశాన్ని విశాఖపట్టణంలో నిర్వహించామని తదుపరి సమావేశాన్ని రాష్ట్రంలోని మరో ప్రాంతంలో నిర్వహిస్తామన్నారు.
గత ఐదేళ్లలో ఒక్కసారి సమావేశం లేదు
పిటీషన్ కమిటీ సమావేశాన్ని గత ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా నిర్వహించింది లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఒక పిటిషన్ కమిటీ యే కాకుండా, అనేక కమిటీల సమావేశాలను కూడా నిర్వహించలేదన్నారు. గత ఐదేళ్లలో శాసన వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. గత ఐదేళ్లలో 66 రోజుల పాటే అసెంబ్లీ పని దినాలను నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేక అసెంబ్లీ లు ఉన్నప్పటికీ, కొన్ని అసెంబ్లీ లు సంవత్సరానికి 6 నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే పనిచేస్తాయన్నారు. మరి కొన్ని రాష్ట్రాలలో ప్రతినెల రెండు వారాలపాటు పని చేస్తాయని తెలిపారు.
శాసన వ్యవస్థను యాక్టివ్ చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయం
శాసన వ్యవస్థను యాక్టివ్ చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అనుబంధ కమిటీల ఏర్పాటులో కొంత ఆలస్యమైనప్పటికీ , ఇప్పటికే ఐదు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల వ్యవధిలో కంబైన్డ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొన్నట్లుగా వెల్లడించారు. శాసన వ్యవస్థలో శాసనసభ్యులు ప్రతి సమస్యను తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకొని వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత శాసన సభ్యులదేనని అన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు 100 రోజులపాటు జరిగేవన్నారు. ఏ సమస్య ఉన్న అసెంబ్లీలో చర్చించాలన్నది శాసనసభ ముఖ్య ఉద్దేశమని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు సుదీర్ఘ కాలం పాటు నిర్వహించడం లేదని, శాసనసభ్యులు కూడా ఏ పని చేయకూడదో ఆ పనినే చేస్తున్నారన్నారు. ఏ పని అయితే చేయాలో ఆ పని గురించి తెలియడం లేదన్నారు. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శాసనసభ అనుబంధ కమిటీలు క్రియాశీలకంగా పనిచేసి శాసన వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించారన్నారు.
ప్రజలకు వాళ్ళ హక్కులను తెలియజేయాలి
ప్రజలకు వాళ్ళ హక్కులు ఏమిటో తెలియజేసి, శాసనసభ్యులుగా మా బాధ్యత ఇది… మీ బాధ్యత మీరు గుర్తెరిగి ప్రధాన సమస్యలను పిటిషన్ కమిటీకి నివేదించేలా చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు నివేదించిన అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు, శాంతి భద్రతల సమస్యలు, ఇతర ప్రధాన సమస్యలపై శాసనసభ్యుల ద్వారా పిటిషన్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తప్పకుండా ప్రధాన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. సుమోటోగా ఫిర్యాదులను స్వీకరించే అధికారం ఈ కమిటీకి లేదని, అలాగే సమస్యల పరిష్కారానికి కూడా కాల వ్యవధి అంటూ ఏమీ లేదన్నారు. అయితే వీలైనంత త్వరగా అనే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కోర్టులలోను కొన్ని కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని, మరి కొన్నింటికి సమయం పడుతుందని గుర్తు చేశారు. అయితే తమ కాలవ్యవధి ఐదేళ్లు మాత్రమే కావడంతో తమ శాసనసభ్యులకు, ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అప్పుడే మీరు కూడా (మీడియా ఉద్దేశించి ) మంచిగా రాస్తారు కదా అని ఆయన అన్నారు.
ప్రభుత్వం పరిష్కరించాల్సిందే..
ఒక సమస్య ప్రజా బహుల్యంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సమస్యను పరిష్కరించకపోతే, ప్రజల తరఫున పిటిషన్ కమిటీ ప్రశ్నిస్తుందన్నారు.. ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలపై విచారణ జరిపించి, పరిష్కారానికి కృషి చేయగలమన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు ఇచ్చిన నివేదికను శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుల మధ్య నివేదించగలమన్నారు. శాసనసభ్యుల ద్వారా ఒకవేళ ఫిర్యాదులు పిటీషన్ కమిటీకి అందడం లేదని తెలిస్తే రూల్స్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించే శాసనసబాధిపతి, ఆ ప్రతిబంధకాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా శాసనసవ్యవస్థ ఉన్న అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తామన్నారు.
ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చే ఆక్రమణల తొలగింపు
ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువగట్లపై ఆక్రమణల తొలగింపులో కోర్టు తీర్పును తూచా తప్పకుండా పాటిస్తూ, నిర్వాసితులకు ఆల్టర్నేటివ్ సైట్లను , ఇండ్ల నిర్మాణం కోసం గ్రాంట్లు మంజూరు చేసిన తర్వాతే తొలగిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఇండ్ల తొలగింపు పై కామ్రేడ్లు చేస్తున్న ఆరోపణలని ఒక మీడియా ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువ గట్లు, రోడ్డు మధ్య పెద్ద ఎత్తున గతంలో ఆక్రమణలు జరిగినట్లు తెలిపారు. కాలువ గట్లపై ఇండ్లు నిర్మించుకున్న వారు బాత్రూమ్ ల నిర్మాణం కోసం, ఇతరాత్ర అవసరాల కోసం కాలువలను పూర్తిగా ఆక్రమించారన్నారు. కాలువ గట్లను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న వారు వదులుతున్న వ్యర్ధాలు మంచినీటి కాలువలలో కలిసిపోయి, చెరువులలోకి వెళ్లి కలుస్తున్నాయన్నారు. ఆ కలుషిత జలాలు సేవించిన గ్రామస్తులు అంతుచిక్కని వ్యాధులతో మంచాన పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే దుంపగడప అనే గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ఒక బాలిక మృతి చెందిందన్నారు. కామ్రేడ్స్ వచ్చి ఆందోళన చేశారన్నారు. అసలు విషయం ఏమిటని ఆరా తీయగా… కలుషిత జలాలే కారణమని తెలిసిందన్నారు. దుంపగడప గ్రామంలో 200 నుంచి 250 గృహా లు కాలువ గట్లను ఆక్రమించి నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరికీ గత ప్రభుత్వ హయాంలో ప్లాట్లను మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఎవరో కొద్దిమందికి ప్లాట్లు ఇవ్వలేదని , ఆ తర్వాత వారికి కూడా ప్లాట్లను ఇవ్వడం జరిగిందన్నారు.. అయినా కొంతమంది కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మరొక గ్రామంలో కాలువ గట్లను ఆక్రమించుకున్న ఇండ్లను తొలగిస్తే, ఎవరైనా చనిపోతే వచ్చే ప్రశ్నించే కమ్యూనిస్టులే ఇప్పుడు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.. కాలువ గట్లను ఆక్రమించిన వారికి చట్ట ప్రకారం ఆల్టర్నేటివ్ సైట్లను కేటాయించి, ఇండ్ల నిర్మాణానికి గ్రాంట్లు మంజూరు చేసిన తర్వాతే తొలగిస్తున్నామన్నారు .. తాగు నీటి కాలువలు, చెరువులను కలుషితం చేయవద్దని స్పష్టమైన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, నీటి వనరులను ఆక్రమించవద్దని న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ… పేదల ఇండ్లు కూల్చి వేస్తున్నారని కమ్యూనిస్టులు ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.