నువ్వేం ప్రధానివి.. మోదీ పేరెత్తడానికే భయపడుతున్నావ్- షరీఫ్పై పాక్ ఎంపీ నిప్పులు
జయజయహే : భారత్ యుద్ధానికి దిగిన వేళ.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. స్వదేశంలో రాజకీయంగా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఆయన పనితీరును తప్పు పడుతున్నాయి. నిండు పార్లమెంట్లో ఏకిపడేస్తోన్నాయి. పాకిస్తాన్ ఎంపీ ఒకరు షెహబాజ్ షరీఫ్పై నిప్పులు చెరిగారు. ఆయనను పిరికిపందగా అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడే పిరికివాడిగా విమర్శించారు. భారత్ అన్నా, ఆ దేశ ప్రధాని మోదీ అన్నా భయపడే వ్యక్తి తమ దేశాన్ని పాలిస్తోన్నాడని ధ్వజమెత్తారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని నిరూపించుకునే విషయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఒకవంక భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంటే దానికి భిన్నంగా పాకిస్తాన్ నాయకత్వం ప్రవర్తించిందని, ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. తమ దేశంపైకి యుద్ధానికి దిగినా కూడా భారత్కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా ప్రధాని షెహబాజ్ షరీఫ్ నుంచి రాలేదని గుర్తు చేశారు. భారత్ సరిహద్దులో నిల్చున్న పాకిస్తాన్ సైనికులు గానీ, ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు గానీ ధైర్యంగా పోరాడుతున్నాయని, ప్రధాని షరీఫ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయట్లేదని మండిపడ్డారు. ఒక దేశ ప్రధానమంత్రి సింహంలాంటి వాడు అయినప్పుడు ఆ దేశ ప్రజలు కూడా సింహంలాగే శతృవులపై పోరాడుతారని ఆ ఎంపీ వ్యాఖ్యానించారు. అదే ఆ సింహాల నాయకుడు పిరికివాడ అయినప్పుడు దేశ ప్రజలు కూడా పిరికిపందలుగా మారుతారని, ఎప్పుడూ గెలవలేరని, యుద్ధాలను కూడా ఓడిపోతారని అన్నారు. భారత ప్రధాని మోదీ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడే ఓ పిరికివాడు పాకిస్తాన్ ప్రధాని అయినప్పుడు.. సరిహద్దులో పోరాడుతున్న సైనికులకు ఏ సందేశం ఇవ్వగలమని ఆ ఎంపీ నిండు పార్లమెంట్లో ప్రశ్నించారు. దేశ ప్రజల్లో ధైర్యం నూరిపోయాల్సిన నాయకత్వం ఇప్పుడు అవసరమైందని వ్యాఖ్యానించారు.