జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన.అనిల్
శ్రీకాకుళం : జయజయహే : సామాజిక బాధ్యత మనందరిదని, వీలైనంతవరకు గుడ్డ (జూట్) సంచులను వినియోగించాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన.అనిల్ శనివారం అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు, డా. జామి బీమ శంకర్ సూచనలతో, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన.అనిల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులు ముద్దు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె (జూట్) సంచుల వాడకం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి శుభ సూచకమని, మార్పు మనతోనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు వీలైనంతవరకు ప్లాస్టిక్ సంచులకు బదులు, గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. కార్యదర్శి తమ్మినేని.ఉష రాణి,మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులతో పర్యావరణ కాలుష్యం వాటిల్లటమే కాకుండా, కాన్సర్ తోపాటు అనేక రోగాలకు కారకులవుతామన్నారు. అలాగే ఒక్క సారి వాడి, బయటకు పారవేసే వాటిని వాడాలని, వాటిని రహదారులపై పారవేయకుండా రహదారికి ఇరువైపులా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్తకుండీలో వేసి, పర్యావరణ పరిరక్షణతోపాటు, మున్సిపల్ దిగువస్థాయి ఉద్యోగులకు సహకరించిన వారవుతారన్నారు. అనంతరం జేసీఐ సభ్యులు, గ్రంధాలయ ఉద్యమ సంస్థ జిల్లా కన్వీనర్ బుడుమూరు. సూర్యారావు గుడ్డ సంచులను శ్రీకాకుళం బస్ స్టాండ్ కూడలి వద్ద ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, బయట పళ్ళ వ్యాపారులకు సంచులను అందించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జోన్ ఆఫీసర్ బెందాళం. వర లక్ష్మి, సభ్యులు లావణ్య. ఉర్లం. శివతేజ తదితరులు పాల్గొన్నారు.