Thursday, June 19, 2025
HomeBlogపరువు హత్యాలా? అహంకారపు అకృత్యాలా? తెలుగు రాష్ట్రాల్లో నానాటికి పెరిగిపోతున్న దురహంకారం హత్యలు

పరువు హత్యాలా? అహంకారపు అకృత్యాలా? తెలుగు రాష్ట్రాల్లో నానాటికి పెరిగిపోతున్న దురహంకారం హత్యలు

కన్న ప్రేమను కాటికి పంపుతున్న కసాయి తల్లిదండ్రులు

క్షీణికవేశములో ప్రాణాలు తీస్తున్న కుల,మతోన్మాదులు

విచక్షణ మరిచిన రాక్షసులుగా మారుతున్న రక్త సంబంధీకులు..

వేరే కులం, వేరే మతం వారిని ప్రేమించారన్న కారణంతో…కొన్ని చోట్ల కూతుర్ని, మరికొన్ని చోట్ల ఆమె ప్రేమించినవాడిని బలితీసుకుంటున్న అమానుష దృశ్యాలు మన చుట్టూ నిత్య కృత్యంలా మారాయి,చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దగా పెంచిన తమ పిల్లలని ఎదిగిన తరువాత తన ఇష్టానుసారం నచ్చిన వాడిన ప్రేమించి పెళ్లి చూసుకోవడం నేరంగా చూస్తున్న కొంత మంది తల్లిదండ్రులు పరువు అనే భ్రమలో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు.

పరువు హత్యలు అనే ముసుగులో కన్న వారిని క్రూరంగా చంపుకుంటున్నారు, ఇది పరువు కోసం కాదు – కుల దురహంకారపు అకృత్యం..తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పరువు హత్యల పేరిట జరుగుతున్న దురహంకార హత్యలు – ఇది ప్రేమ మీద మాత్రమే దాడి కాదు, కులం, మతం, మనిషి మనుగడ మీద దాడి!

మిర్యాలగూడలో ప్రణయ్, సూర్యాపేటలో కృష్ణా కేసులు మీడియా లోకానికి తెలిసినవే. కానీ ప్రతి రోజు ఇలాంటివి ఎన్నో సమాజంలో జరుగుతున్నాయి..

అలాంటి వాటిల్లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మావత్వానికి మాయని మచ్చగా, కుల, మతోన్మాదదానికి పరాకాష్టగా మారాయి..

*అనంతపురం జిల్లా లో తండ్రి ,తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందనే కారణంతో దారుణంగా హత్య చేయడం

హయత్ నగర్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందని నడిరోడ్డుపై తమ్ముడు నరికి చంపడం , చిత్తూరు జిల్లాలో ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి ఇలాంటివి ఎన్నో ఇటీవల కాలంలో మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి… రక్త సంబంధికులే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న సంఘటనలునానాటికి పెరుగుతున్నాయి..

క్షీణికవేశంలో చేస్తున్న పనులకు జీవితాంతం తమ కుటుంబాలలోను క్షోభను మిగిలిస్తున్నారు..

ఇది పరువు కాదు – పాశవికత్వానికి పరాకాష్ఠ !

వేరే కులం, వేరే మతం వారిని ప్రేమించారని కన్న పిల్లలని చంపడం పరువా? కాదు మానవత్వానికి మాయని మచ్చ, ఆటవిక క్రూరత్వానికి పరాకాష్ట,

అది గౌరవం కాదు – అది ఓ క్రూరమైన అహంకారపు చీకటి కోణం, ఇలాంటి చర్యల వలన పరువు పెరగటం కాదు వున్న పరువు పోయి జీవితాంతం నేరస్థుడిగా మిగిలి కుటుంబాలకు క్షోభను మిగిలించడం తప్ప ఏమి ఉపయోగం ఉండదు

ఈ దురహంకార హత్యలకు ప్రధాన కారణాలు:

✓ కుల, మత ఉన్మాదత్వం: వివాహం లేదా ప్రేమ సంబంధం కులాంతరంగా, మతాంతరంగా ఉంటే… అది “ఇంటి పరువు”, “కుటుంబ గౌరవం”కు భంగం అని భావించి కుటుంబ సభ్యులే హత్యకు దిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

✓ సాంప్రదాయ ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం : యువత సాంప్రదాయాలు పాటించకుండా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించినా, స్వేచ్ఛగా జీవించాలనుకున్నా పెద్దలు దాన్ని సహించలేక ఘోర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి.

✓ స్త్రీల స్వేచ్ఛపై నియంత్రణ : అమ్మాయి తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించడం, వివాహం చేసుకోవాలనుకోవడం వంటి విషయాలు కొన్ని కుటుంబాల్లో తట్టుకోలేరు. వారు తీసుకునే నిర్ణయాన్ని “అవమానంగా” భావించి హత్యలు చేస్తున్నారు

✓ సామాజిక ఒత్తిడులు :”మీ ఇంటి పిల్ల పరువు తక్కువ పని చేసింది?” అన్న మాటలు వింటే తట్టుకోలేమనే భయం. తాతలు, పినతండ్రులు, బంధువుల మాటల వల్ల కుటుంబ పెద్దల గౌరవాన్ని కాపాడుకోవాలనే మానసిక స్థితిలో హింసకు పాల్పడుతున్నారు

✓ అహంకారం మరియు సమాజ పట్ల భయం : “మా ఇంట్లో ఇలాంటివి జరుగటం సిగ్గు” అని భావించి, అది తప్పు కాకపోయినా పిల్లలపై కోపాన్ని పెంచుకొని ప్రాణాలు తీయడం

✓ సహా జీవనం : సమాజం వీటిని ఒప్పుకోకపోవడం, కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భయం కూడా హత్యలకు దారితీస్తుంది.

✓ అనుభవ శూన్యత, అసహనం : పెద్దలు, కుటుంబ సభ్యులు పిల్లల మానసిక స్థితిని, ప్రేమను,అభిప్రాయాలను ఆలోచనలను అర్థం చేసుకోలేకపోవడం. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా – మారాల్సింది ఆలోచనా విధానం

పి సి 302 ప్రకారం హత్య శిక్షార్హ నేరం. ఇలాంటి వాటికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి కానీ సమాజంలో

మనుషుల ఆలోచనా ధోరణి మారనంత కాలం ఎన్ని చట్టాలు వున్నా ఉపయోగం లేదు

ఈ దురహంకార హత్యలు నివారించడానికి కొన్ని మార్గాలు:

✓ అవగాహన కార్యక్రమాలు – ఆలోచనలు మారితేనే సమాజం మారుతుంది . కుటుంబాలలో, పాఠశాలల్లో, గ్రామస్థాయిలో ప్రేమ, సంబంధాలు, వివాహ స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై అవగాహన కల్పించాలి.”పరువు” అన్నది ప్రాణాల కంటే పెద్దది కాదని తెలియ చేయాలి .

✓ కఠిన చట్టాలు & శిక్షలు – పరువు హత్యలకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలి.అతి త్వరగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలి.దోషులెవ్వరైనా క్షమించరాదని న్యాయవ్యవస్థ స్పష్టంగా చాటాలి.

✓ తల్లిదండ్రులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం-పిల్లలపై పట్టు కాదు, ప్రేమతో బంధం అవసరమని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను వినే పరిస్థితిని కల్పించాలి

✓ యువతకు అవగాహన కల్పించడం- ప్రేమ, వయసు, అర్ధం చేసుకోవడం, సంయమనం అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి.సంబంధాల్లో స్పష్టత, బాధ్యత అనే భావనలు నేర్పాలి.

✓ మహిళల సాధికారత – అమ్మాయిలకు స్వేచ్ఛ, విద్య, ఆత్మవిశ్వాసం ఇవ్వాలి.వారు తమ నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉండాలి. మత, కుల సంఘాల నేతలతో చర్చలుకుల సంఘాలు, మత నాయకులు ప్రగతిశీలమైన సందేశాలు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి . మతాల పేరుతో హింసను ప్రేరేపించే కార్యక్రమాలు నియంత్రించాలి.

✓ మీడియా బాధ్యత – హత్యలకు గౌరవ హత్యలు అనే మాటలు వాడకూడదు.స్పష్టంగా “పాశవిక హత్య”, “వికృత ఆలోచన” అనే రూపంలో చూపించాలి.బాధితులను నిందించే తీరు విడిచిపెట్టాలి.

✓ క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడం – గ్రామాల్లో, క్షేత్ర స్థాయిలో వీటి పట్ల స్వచ్ఛంద సంస్థలు, పోలీస్లు మొదలైన వారు వీటి పట్ల అవగాహన కల్పించాలి. ఈ మార్గాలు సమగ్రంగా అమలవుతే పరువు హత్యలు అరికట్టగలము.

పరువు కోసం ప్రాణాలు తీసే సమాజం కన్నా… ప్రేమ కోసం ప్రాణాలు కాపాడే సమాజమే అవసరం.

*కులం, మతం కంటే ముందు మనమంతా మనుషులం అని గుర్తుంచుకోవాలి.. ఏ కులం, మతం కూడా ప్రేమను ద్వేషించదు చంపమని చెప్పదు, మనిషి ఏర్పరుచుకున్న పరువు అనే భ్రమలో విచక్షణ మరిచి కొందరు ఆడుతున్న వికృత క్రీడలు ఇవి ఏ సమాజము వీటిని హర్షించదు.

జి. అజయ్ కుమార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments