ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను పూర్తి స్దాయిలో అమలు చేయలేదనే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయితే ఈ ఏడాది కాలంలోనే ఎంతో మంది అనర్హులు అప్పటికే అమలవుతున్న పథకాలను కొల్లగొట్టేస్తున్నారు. వీరిని గుర్తించి లబ్దిదారుల జాబితా నుంచి తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పథకాలు కొల్లగొడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను ఈ జాబితాల నుంచి తొలగించారు.
రాష్ట్రంలో ఓవైపు పథకాల భారం ప్రభుత్వంపై భారీగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి అమలులో లొసుగుల్ని వాడుకుంటూ వాటిని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. వీరిని తొలగించకుండా పథకాలు అమలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యేలా ఉంది. దీంతో కూటమి సర్కార్ ఈ దిశగా గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా లక్షన్నర మంది ప్రభుత్వోగులు పథకాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వారిని పథకాల జాబితా నుంచి తప్పించారు.ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది ఉద్యోగులు గత వైసీపీ ప్రభుత్వంలో లబ్దిదారులుగా చేరి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా వీరు ఇలా తీసుకుంటున్నా తనిఖీలు చేయాల్సిన విభాగాలు నిద్రపోతున్నాయి. దీంతో ఇంత కాలానికి గ్రామ, వార్డు సచివాలయాలశాాఖ వారిని గుర్తించి పథకాల జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా చాలా మంది ఇలాంటి అనర్హులు పథకాలు తీసుకుంటూనే ఉన్నారని సమాచారం.