పహల్గామ్ ఉగ్రదాడి ఘటన..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
మధుసూదనరావుకి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జయజయహే : పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయి, కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్… పహల్గామ్ మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా.. అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలుండాలని చెప్పారు. 13వేల 326 పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మధుసూదనరావు నివాసానికి పవన్ కళ్యాణ్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఉగ్రదాడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది
ఇక, ఉగ్రవాద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. అమాయకపు ప్రజల పై ఉగ్రదాడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో అమాయకపు ప్రజలు బలయ్యారు. పహల్గం ఉగ్రదాడిలో ఏపీ వాసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు మృతి చెందారు.