యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా..
అనకాపల్లి జిల్లా,జయజయహే : నక్కపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హాకీ మినిగ్రౌండ్ను హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఆస్ట్రోటర్ఫ్తో రూ.1.6 కోట్ల వ్యయంతో మైదానం నిర్మించబడింది. ఈ సందర్భంగా మంత్రి అనిత, హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. మంత్రి అనిత మాట్లాడుతూ, హాకీ గ్రౌండ్లో వాటర్, కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ విభాగంలో పనిచేస్తూనే క్రీడాకారులను తయారుచేస్తున్న సూరిబాబు స్పూర్తిదాయకం అని అభినందించారు. నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషకరమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంటారని, సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఆవిధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. నక్కపల్లికి చెందిన 30 మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నక్కపల్లి ‘హాకీ నక్కపల్లి’గా పేరు తెచ్చుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్మాక సర్పంచ్ చిన్న ఆత్మశాంతికి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే, పాయకరావుపేటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం చొరవతో నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుందని వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ కోచ్లను సత్కరించారు.