ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకుందాం
భవిష్యత్తు తరాలకు ఆస్తి మన విత్తన సంపత్తి
డాక్టర్ డివిజి శంకర్రావు, చైర్మన్, , ఆంధ్రప్రదేశ్
జయజయహే : దేశీయ విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఎస్ టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు కోరారు. సిఫా, వాసన్, ఆర్ ఆర్ ఎ ఎన్ సంస్థల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా లోని చింతపల్లి మండలంలోని లమ్మసింగిలో అంతర్జాతీయ ఆదిమ విత్తనాలు పండుగ సోమవారం నిర్వహించిన అనంతరం ఆయన అయిదు వందల విత్తనాలతో సిఫా నిర్వహించిన ప్రదర్శనను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకుందామన్నారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిగా మన విత్తన సంపత్తి మనమే కాపాడుకోవాలి అని కోరారు. పంచాయతీ పరిధిలో 12 గ్రామాలను భారత దేశీయ విత్తనాల గ్రామాలుగా (ఇండియన్ ఇండీ జీనియస్ సీడ్ విలేజెస్) తీర్చిదిద్దే కార్యక్రమం అభినందనీయం అన్నారు. ఇంతవరకూ రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు, రసాయన కలుపు తీత ముందులు వేయకుండా కాపాడిన స్వచ్చమైన భూమిని భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేయవలసిన బాధ్యత మన అందరి మీదా ఉంది అన్నారు. విత్తన గ్రామాలు అభివృద్ధి చేయడానికి, ప్రకృతి ఆధారిత పంటలు పండించే విషయంలో తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రా యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం మొదలైన పదివేల సంవత్సరాలు కిందటి కాలం లోని విత్తనాలు దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో నుంచి సేకరించి ఇక్కడ గ్రామాల్లో నాటి పెంచడం అభినందనీయం అన్నారు. 500 రకాలకు పైగా విత్తనాలు సేకరించడం, వాటిని తిరిగి పెంచడం, వాటి నుంచి తిరిగి విత్తనాలు ఉత్పత్తి చేయడం వెనుక ప్రతి ఒక్కరి కృషి చాలా గొప్పది అని చెప్పి కొనియాడారు. ప్రధానంగా వరి, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, కందమూలాదులు, పండ్లు జాతి మొక్కలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు తీసుకుని వచ్చి నాటి పెచడం చాలా అభినందించాల్సిన అంశం అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంఆర్వొ రవికుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎపి బయోడైవర్సిటీ బోర్డు ప్రాంతీయ సమన్వయకర్త జానకీరావు, నీతీ అయోగ్ ప్రతినిధులు నారాయణ రెడ్డి, చైతన్య రెడ్డి, సిఫా సంస్థ సిఇఒ డాక్టర్ శశిప్రభ. వాసన్ అసోసియేట్ డైరెక్టర్ సన్యాసి రావు, హీఫర్ ఇంటర్నేషనల్ ప్రోజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సునీత, ఆర్ ఆర్ ఎ నెట్వర్క్ ప్రోజెక్ట్ కోఆర్డినేటర్ ఎం లీలావతి, సంజీవని సంస్థ ప్రతినిధి దేవుళ్ళు, గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. అలాగే ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రాల నుంచి పలువురు ఆదివాసీలు తాము పండించిన విత్తనాలతో పాల్గొన్నారు.