Wednesday, June 18, 2025
HomeBlogడాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, ఐఏఎస్ ఆదర్శప్రాయులు - మానవత స్వచ్ఛంద సేవా సంస్థ

డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, ఐఏఎస్ ఆదర్శప్రాయులు – మానవత స్వచ్ఛంద సేవా సంస్థ

జయజయహే : గత 90 నెలలుగా టొబాకో బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా నిబద్ధత, నిజాయితీ గల సీనియర్ ఐఏఎస్ అధికారిగా డా. అద్దంకి శ్రీధర్ బాబు విశిష్ట కృషి చేశారని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ మంగళవారం ఉదయం గుంటూరులోని జ్యోతి నిలయం హాలులో డా.అద్దంకి శ్రీధర్ బాబు, ఐఏఎస్ కి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. డా.అద్దంకి శ్రీధర్ బాబు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బదిలీ అయిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు. మానవత చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ డా. అద్దంకి శ్రీధర్ బాబు టొబాకో బోర్డును రైతుల పాలిట కల్పవృక్షంగా మార్చినారని, పొగాకు రైతుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను అధ్యయనం చేసేవారని తెలిపారు. బ్యాంక్ ఉద్యోగిగా ప్రారంభమై ఐపీఎస్ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా ఎదుగుతూ సమాజానికి రోల్ మోడల్ గా డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు మారారని తెలిపారు. విద్యాసంస్థలలో విద్యార్థులకు సరైన త్రోవ చూపిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేశారన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నేడు బ్యూరోక్రసీ అధికార పార్టీ నేతల జోక్యంతో శక్తివంతంగా పనిచేయలేక పోతుందని, అవినీతిమయంగా మారిందని, ఇలాంటి పరిస్థితులలో డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు నిజాయితీతో, నిబద్ధతో అవినీతి రహితంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. డా. అద్దంకి శ్రీధర్ బాబు యువ విద్యార్థులలో ఉత్తేజాన్ని కలిగించడానికి రచించిన మీరూ శ్రీలు అనే గ్రంథం వేలాది మంది విద్యార్థుల్లో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు కీ.శే. ఎస్.ఆర్. శంకరన్ ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి డా. అద్దంకి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేయాలని గమ్యాలను, లక్ష్యాలను రూపొందించుకుని వాటి సాధన కోసం ఇష్టపడి చదవాలన్నారు. విద్యతో పాటు జనరల్ నాలెడ్జ్ ను పెంచుకుంటూ, డిబేటింగ్, వ్యాసరచన లాంటి పోటీలలో పాల్గొనాలని తెలిపారు. స్వయంకృషితో ఎదిగిన మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలన్నారు. నా తండ్రి స్ఫూర్తితో, ప్రేరణతో ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. ప్రతిరోజు కనీసం 6 గంటల పాటు ఏకాగ్రతతో చదవాలని కోరారు. ఏదైనా సాధించగలమనే విశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వెయ్యాలని కోరారు. సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్. అరవింద్ ప్రసంగిస్తూ డా. అద్దంకి శ్రీధర్ బాబును ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి అడుగులు వేయాలన్నారు. స్టెప్ ప్రెసిడెంట్ ప్రత్యూష సుబ్బారావు ప్రసంగిస్తూ స్టెప్ మరియు మానవత సంయుక్త ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం మే 30వ తేదీ వరకు గుంటూరులోని బ్రాడీపేట 6/9 జ్యోతి నిలయంలో ఉచితంగా నిర్వహిస్తున్నామని నేడు డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు చేసిన ప్రసంగం విద్యార్థులను ఉత్తేజపరుస్తూ, ఉత్సాహపరుస్తూ ఆలోచింప చేసిందన్నారు. జిడిఎస్ఎస్డబ్ల్యూఎస్, సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ, మానవత, స్టెప్ సంస్థల నేతలు డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబును ఘనంగా సత్కరించారు. శాలువ కప్పి మేమెంటో అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాంబశివరావు, బి.ఎన్. మిత్ర, హర్ష, టి. ధనుంజయ రెడ్డి, నల్లమోతు సాంబశివరావు, బాలకృష్ణ చౌదరి, టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు చేసిన ప్రసంగాన్ని శ్రద్ధగా విని, ఉత్తేజం పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments