కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
ఈ నేరానికి పాల్పడిన పట్టాన్ గ్రామ నివాసితులు నాగరాజ (23), ఇరన్న (27), భిర్ణ్య (21), సిద్ధినాద (22), నాగరాజ్ (17), పిరేష్ (35), సాగర్ (24), రచన్న్య అలియాస్ గిల్లి (22), చంద్రకాంత్ (30), భాగ్యశ్రీ (30) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. వాస్తవానికి.. గత సంవత్సరం సోమనాథ్ తాలికోటి అనే యువకుడిని హత్య చేశారు. అప్పుడు సోమనాథ్ భార్య తన భర్త మృతదేహం ముందు హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ప్రతిజ్ఞ చేసింది.
గత ఏడాది నవంబర్ 12న నిందితుల్లో ఒకరైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్ తాలికోటి హత్యకు గురయ్యాడు. తాజాగా హత్యకు గురైన సిద్ధారుధ, అతని కుటుంబ సభ్యులు సోమనాథ్ను దారుణంగా హత్య చేశారు. సోమనాథ్ హత్య అనంతరం అతని భార్య భాగ్యశ్రీ తన భర్త మృతదేహం ముందు ప్రమాణం చేసింది. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీసివేయనని ఆమె ప్రతిజ్ఞ చేసింది. సోమనాథ్ సోదరుడు ఈరన్న ముందు భాగ్యశ్రీ ఈ ప్రమాణం చేసింది.
సోమనాథ్ ను హత్య చేసిన నిందితులు సిద్ధారుధ, జగదీష్, అన్నప్ప ఇటీవల బెయిల్పై వచ్చారు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఈరన్న, నాగరాజు, భాగ్యశ్రీ ఎదురుచూస్తున్నారు.. జూన్ 24, మంగళవారం అర్ధరాత్రి సిద్ధారుధ, జగదీష్ ధాబాలో ఉన్నారని వీరికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సిద్ధారుధ, జగదీష్లను చంపారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు డబుల్ మర్డర్ అనుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రక్తపు మరకలను అనుసరించి వెనుక ఉన్న పొలంలోకి పరిగెత్తింది. ధాబాలో పనిచేసే రామచంద్ర అనే మరో వ్యక్తిని పొలంలో హత్య చేసినట్లు తెలిసింది. అప్పుడు ఇది ట్రిపుల్ మర్డర్ అని వెలుగులోకి వచ్చింది.
విచారకరమైన విషయం ఏమిటంటే హంతకుల లక్ష్యం రామచంద్ర కాదు అన్నప్ప. అయితే, చీకటిలో అన్నప్ప, రామచంద్ర హంతకుల నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. హంతకులు వారిని వెంబడించారు. చీకటిలో హంతకులు రామచంద్రే అన్నప్ప అని భావించి చంపేశారు. ప్రస్తుతం, ఈ ట్రిపుల్ మర్డర్కు సంబంధించి పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు..