అసలు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఓ పక్క ప్రేమ విషయంలోనే గొడవల కారణంగా.. వేరే వ్యక్తితో సంబంధం కారణంగా తమ భాగస్వామిని హత్య చేస్తున్న ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. మరోవైపు ప్రియుడితో కలిసి భార్యే.. భర్తను కిరాతకంగా హత్య చేస్తున్న లేదా చేయిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా అయితే హనీమూన్లో భర్తను చంపించిన ఇందౌర్ యువతి సోనమ్ రఘువంశీ ఉదంతం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది ఓ కిలేడీ. ఒక విషయాన్ని మర్చిపోక ముందే అదే తరహాలో మరో విషయం చోటు చేసుకుంటూ ప్రజలను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఓ నవ వధువు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ యువతి.. ఫస్ట్ నైట్ రోజు మాత్రం గదిలోకి కత్తి తీసుకెళ్లి టచ్ చేస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్ రాజ్కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో సంతోషంగానే ఉన్న వధువు.. మొదటి రాత్రిరోజు మాత్రం వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా’ అంటూ తన భర్తను బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని వెల్లడించింది. విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్తన, అతడి కుటుంబసభ్యులను బెదిరింపులకు గురి చేసింది.
దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీలో ఈ విషయాన్ని బయటపెట్టారు. దాంతో ఆమెను తన పుట్టింటికి పంపించారు. కాగా సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో.. వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.