సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు
అనకాపల్లి, జయజయహే : జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు మరియు చీటింగ్ తదితర అంశాలు ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ఈ వేదికలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్., స్వయంగా హాజరై, ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణమే విచారణ చేపట్టి చట్టపరమైన పరిష్కారం అందించాలని సూచించారు. “ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా పరిష్కరించడానికి పోలీసు శాఖ కట్టుబడి ఉంది. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం,” అని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్సై వెంకన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు.