వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని నాగబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రియాక్ట్ అయ్యారు. ‘రుణ భారంతో అప్పజెప్పిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలకై ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి హంతకులకు వంత పాడడం, పోలీస్ వ్యవస్థను బెదిరించడం దేనికి నిదర్శనం. సమస్యలు, సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. ప్రతిస్పందించే యంత్రాంగం అందుబాటులో ఉంది’ అని నాగబాబు అన్నారు.