ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఎవరి ఫోన్ వదలకుండా.. ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారంటూ.. రోజుకో పేరు బయటపెడుతున్నారు.. తెలంగాణకు చెందిన నేతల ఫోన్లనే కాదు.. ఏపీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి కూడా.. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఇచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి.. ఈ తరుణంలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్ షర్మిల..
ఇక, జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.. జగన్, కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఇద్దరి స్కెచ్ వేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని.. ఇద్దరు సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపించారు.. వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికొచ్చి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారని చెప్పుకొచ్చారు.. అయితే, ఈ విషయాన్ని ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా? అంటే అనుమానమే అని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారణను వేగవంతం చేయాలని కోరారు..