ఈ ఎస్ఐ రూటే సపరేటు…
జయజయహే : షామీర్ పేట్ పోలీసు స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ సంఘటన కేసులో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అరగంట పాటు సాగిన ఈ ఆసక్తికరమైన సంఘటనలు అచ్చం సినిమా థ్రిల్లర్ ను తలపించే విధంగా షామీర్ పేట్ ఠాణా ఎస్ఐ పరుశురాం లంచం డబ్బులు ముట్టడానికి చేసిన ప్రయత్నం ఏసీబీ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. షామీర్ పేట్ ఎస్ఐ పరుశురాం గోల్డ్ డ్రాప్ నూనే స్టాక్ గోల్ మాల్ కేసులో నిందితుల నుంచి సోమవారం 22 వేల రూపాయాలు లంచం తీసుకునేందుకు ఎస్ఐ పరుశురాం ముందుగా కేసులో నిందితులు సోమవారం మధ్యాహ్నం 1 గంటకి వచ్చారు. వారు తీసుకు వచ్చిన లంచం డబ్బును ముందుగా ఎస్ఐ పరుశురాం తన కుడి కాలు పక్కను ఉన్న చెత్త డబ్బాలో వేయించాడు. ఆ తర్వాత చెత్త డబ్బాను కుడి నుంచి ఎడమ కాలు దగ్గరకు మార్చాడు.. అనంతరం డబ్బు తీసుకువచ్చిన వారిని మర్యాదపూర్వకంగా స్టేషన్ బయటి వరకు దగ్గర ఉండి పంపించాడు. ఆ తర్వాత తన సీటు దగ్గర కూర్చోన్ని 10 నిమిషాలు ఆగిన తర్వాత చెత్త డబ్బాలో ఉన్న 22 వేల రూపాయాలను చేతితో తీసుకున్నాడు. ఈ విషయం అక్కడే మఫ్టీలో ఉన్న ఏసీబీ అధికారులు పసిగట్టగానే ఎస్ఐ పరుశురాం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇదే నిందితుల నుంచి ఏప్రీల్ 21 వ తేదిన 2 లక్షల రూపాయాలను లంచంగా తీసుకున్న వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టారు.
సీసీ కెమెరాలు లేని చోట తీసుకువెళ్లి….రోడ్డు పై వదిలేశారు
షామీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల గోల్డ్ డ్రాప్ మంచి నూనె స్టాక్ గోల్ మాల్ కు సంబంధించి ఓ కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించి గోల్డ్ డ్రాప్ కంపెని వారు షామీర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీని పై దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం ఆరు మంది మీద కేసును నమోదు చేశారు. చీటింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేస్తామని ఓ భయాన్ని సృష్టించారు . అలా నిందితులు తమను అరెస్టు చేయొద్దని ఎస్ఐ పరుశురాంను సంప్రదించడంతో ముందుగా 2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ పరుశురాం డిమాండ్ చేశాడు. ఈ 2 లక్షలను ఈ నెల 21వ తేదిన సాయంత్రం సమయంలో నిందుతులు స్టేషన్ కు డబ్బుతో వచ్చారు. వారిని కారులో ఎక్కించుకుని సీసీ కెమెరాలను లేని చోట ఎస్ఐ పరుశురాం కారును ఆపాడు. 2 లక్షల రూపాయాలను ముట్టుకోకుండా కారు డిక్కీలో పెట్టించాడు. ఆ తర్వాత వారిని రోడ్డు పైనే వదిలేశాడు. కారు తీసుకుని స్టేషన్ కు వచ్చి డబ్బును కొంత సమయం పాటు ఆగి వాటిని తీసుకున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అలా 2 లక్షలు తీసుకున్న తర్వాత ఇంకా డబ్బులు కావాలని అడిగి సోమవారం ఏసీబీ కి ఎస్ఐ పరుశురాం దొరికిపోయాడు. అయితే ఏసీబీ అధికారులు దర్యాప్తులో ఇలా ఈ కేసులో ఉన్న ఆరుగురి నిందితుల్లో ఇప్పటికే ముగ్గురు దగ్గర అరెస్టు చేస్తామనే భయాన్ని పుట్టించి డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. దీని పై కూడా విచారణ చేస్తున్నారు.
ఉన్నతాధికారి పాత్ర పై ఆరా??
ఈ లంచం వ్యవహారంలో ఎస్ఐ తో పాటు స్టేషన్ లోని ఉన్నతాధికారి పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదైన నిందితుల నుంచి ఎస్ఐ పరుశరురాం ఒకరు ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం అసాధ్యం. ఈ లంచంలో ఇంకా ఎవరి వాటాలు ఎంత అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణను చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఏప్రీల్ 21వ తేదిన తీసుకున్న 2 లక్షల రూపాయాల లంచం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఎస్ఐ పరుశురాం కదలికల పై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఉన్నతాధికారి పాత్ర పై ప్రాధమిక ఆధారాలు లభించగానే పోలీసు ఉన్నతాధికారులకు నివేదికను ఏసీబీ అధికారులు ఇవ్వనున్నట్లు తెలిసింది.